బాసరలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులపై మంత్రి హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. బాసర శ్రీజ్ఞాన సరస్వతి, అడెల్లి పోచమ్మ, కాల్వ శ్రీలక్ష్మీ నర్సింహస్వామి, కదిలి శ్రీపాపహరేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఆలయాల్లో కొనసాగుతున్న పనులు, త్వరలో చేపట్టబోయే పనులకు సంబంధించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆధ్మాత్మికతో పాటు మానసిక ఆహ్లాదం కలిగించేలా ఆలయాల పరిసరాలను తీర్చిదిద్దాలని ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎకో టూరిజానికి క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నప్పటికీ టెంపుల్ టూరిజానికి భక్తులు అత్యధిక ప్రాధాన్యత ఇసున్నారన్నారని వివరించారు.
ఆహ్లాదంగా హారతి ప్రాంతం
బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మ వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. వారికి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు విడిది సౌకర్యం, క్యూ కాంప్లెక్స్, తాగునీరు, షాపింగ్ కాంప్లెక్స్, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించడంతో పాటు గోదావరి నదికి హరతినిచ్చే ప్రాంతాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని చెప్పారు. బోటింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో బాసరలో రూ. 8 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
అడెల్లిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా
అడెల్లిలో ఆలయ శిల్పుల సహకారంతో డిజైన్లు రూపొందించి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. ఆలయ విస్తరణ పనులకు కావాల్సిన భూసేకరణకు తగిన ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్కు అందించాలని చెప్పారు. పుణ్యస్నానాల కోసం ప్రత్యేకంగా షవర్లు ఏర్పాటు చేయాలని, కోనేటిలో స్వచ్ఛమైన నీరు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం.. అంతర్గత రోడ్ల విస్తరణ, పిల్లలకు ప్రత్యేక ఆటస్థలం, భక్తులకు విడిది గృహాలు, వీఐపీ అతిథి గృహాలు, బయో శౌచాలయాలు నిర్మించాలని సూచించారు.
దాతల సహాయంతో
కాల్వ దేవస్థానంలో కోనేటిని అభివృద్ధి పరచడంతో పాటు భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి చెప్పారు. ఆలయాల్లో భక్తులకు కల్పించే పలు సదుపాయాల కోసం దాతలు కూడా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, స్తపతి శ్రీవల్లినాయగం, సీఈజీ సీతారాములు, బాసర ఈవో వినోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: KRMB, GRMB: గెజిట్ అమలుకు రెండు రాష్ట్రాలు సహకరించాలి: బోర్డులు