ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తలపెట్టిన జనతా కర్ఫ్యూను పాటిస్తూ ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా నిర్బంధం పాటించారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం ఐదు గంటలకు జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తూ చప్పట్లు కొడుతూ కరోనా నివారణకు కృషి చేస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ పాటించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. పురవీధుల్లో తిరుగుతూ బయట కనిపించిన వారిని బయటకు రావద్దని.. కరోనా తీవ్రతపై అవగాహన కల్పించారు. ముథోల్లో ప్రజలు సాయంత్రం ఇంటి ముందు చప్పట్లు కొట్టి అనంతరం కులదేవతలను ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. కరోనా మహమ్మారి దేశంలో రాకూడదంటూ అమ్మవార్లను వేడుకున్నారు.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో జనతా కర్ఫ్యూను విజయవంతంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లకు ఎక్కడా హోటళ్లు తెరిచి ఉండకపోవడం వల్ల.. డ్రైవర్లు, క్లీనర్లు కలిసి వంటలు చేసుకుని లారీల్లోనే తిన్నారు. సాయంత్రం ఐదు నిమిషాలపాటు ప్రతి పౌరుడు ఇంటి నుంచి బయటకు వచ్చి దేశ ఐక్యతను చాటిచెప్పేలా చప్పట్లు కొట్టారు.
ఇదీ చదవండః కరోనా ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు