గంజాల్ టోల్ప్లాజా వద్ద ఫాస్టాగ్ సర్వర్ మొరాయించడం వల్ల నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఫాస్టాగ్ కోసం మూడు కౌంటర్లు, నగదు లావాదేవీలకై ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. సాంకేతిక లోపంతో ఫాస్టాగ్ సర్వర్ మొరాయించడం వల్ల వాహనదారులు తిరిగి నగదు కౌంటర్కు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో రెండు కార్లు ఢీకొని స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
వేగంగా వెళ్లిపోయేందుకు ఫాస్టాగ్ విధానం ఎంచుకుంటే, సాంకేతిక లోపం వల్ల ఆలస్యమైందని వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేంలేక నగదు చెల్లించి అక్కణ్నుంచి వెళ్లిపోయారు. నిపుణులను పిలిపించి మరమ్మతు చేయించిన తర్వాత తిరిగి వాహనాలు ఫాస్టాగ్ ద్వారా వెళ్లాయి.