నారాయణపేట జిల్లా మరికల్లో సర్వే నెంబర్ 449 లోని 140 ఎకరాల భూమిని సుమారు 70 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సాగు చేసుకునేందుకు 1969-70 మధ్యకాలంలో ఎకర నుంచి రెండు ఎకరాల వరకు... నాటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... ప్రైవేటు పట్టా భూమి యజమానులకు కొత్త పట్టా పాసుపుస్తకాలు అందజేసినట్టు... ఈ సర్వే నెంబర్కు ఇవ్వలేదు. వెంటనే పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరికల్ పట్టణంలో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయాన్ని, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఈ భూమిని సేకరించి... రోడ్డు వైపు కంచె వేశారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకుంటే... భూమికి బదులుగా భూమిని, అదనంగా పరిహారం చెల్లించాలని, లేదంటే అదే భూమికి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతున్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయం నిర్మాణం పనులను చేపట్టేందుకు గుత్తేదారులు వెళ్లగా... రైతులు అడ్డుకున్నారు. పరిహారం చెల్లించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల మరికల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు రైతు సంఘాలు, వామపక్షాలు, కాంగ్రెస్ నాయకులు మద్ధతుగా నిలిచారు. బాధితుల డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి: తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట.. గాల్లో కుర్చీలు