నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, వైద్య, విద్యుత్ ఇతర శాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై ఇన్ఛార్జి కలెక్టర్ యాస్మిన్ భాషా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ సమయంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ వన్ ఏలూరు వద్ద పంప్హౌస్ మోటర్లు నీటిలో మునిగి సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మేరకు మిషన్ భగీరథ ద్వారా 19 నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చేయడం ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఏలూరు లిఫ్ట్ వన్ పనులు పునరుద్ధరించడానికి మరో మాసం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. జిల్లాలోని 710 హ్యాబిటేషన్ గ్రామాలలో 2,09,000 నివాసాలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం గ్రామాల్లోని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని పనులు జరపాలని సూచించారు. ప్రతి ఇంటికి 30 క్లోరినేషన్ బిళ్లల చొప్పున జిల్లాలో మొత్తం 75 లక్షల ట్యాబ్లెట్లను కొనుగోలు చేయాలని వైద్య సిబ్బందికి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న బోర్లన్నింటికి విద్యుత్ సరఫరా అందించాలన్నారు.
ఇవీ చదవండి: ఉద్యోగ భద్రత కల్పించాలని వీఏఓల ఆందోళన