పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళనకు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. నాగర్కర్నూలు జిల్లాలో వట్టెం జలాశయంలో భూములు కోల్పోతున్న వారు ఆరు రోజులుగా ఆందోళన బాట పట్టారు. పనులు నిర్వహిస్తున్న కంపెనీ ముందు టెంట్ వేసుకుని బైఠాయించారు. భూములు, ఇళ్లు కోల్పోతున్న తమకు సరైన పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ.. పనులను అడ్డుకున్నారు.
ధర్నా చేపట్టిన భూనిర్వాసితులకు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మద్దతుగా నిలిచారు. జిల్లాలోని ఈ విలువైన భూములను ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే లాక్కున్నారని నాగం ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా రైతులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై కోర్టుకు వెళితే ప్రాజెక్టులకు అడ్డంగా కేసులు వేస్తున్నారని తప్పుడు ఆరోపణలు తనపై చేస్తున్నారన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఇచ్చిన విధంగా వీరికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పోతిరెడ్డిపల్లి వద్ద జరిగే రిజర్వాయర్ పనులను నాగం పరిశీలించారు.
ఇవీ చూడండి: ఆటిజం పిల్లలకు ఆమె అమ్మ