నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ముందు భాజపా శ్రేణులు ధర్నాకు దిగాయి. కరోనా వ్యాప్తి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. కేసీఆర్ మొండి వైఖరిని మార్చుకోవాలని, తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నట్టే.. ప్రజల ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలని భాజపా జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు అన్నారు.
కేసిఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుందని ఆరోపించారు. వైరస్ నివారణకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. ప్రైవేటు దవాఖానాలకు మేలు చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ను తెలంగాణలో అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు కరోనా నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
ఇదీ చూడండి: వేములవాడలో పొన్నం ప్రభాకర్ గృహ నిర్బంధం