గతంలో పట్టణాల్లో క్రికెట్ బెట్టింగులు ఎక్కువగా జరిగేవి. కానీ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ అది పల్లెలకు పాకింది. గ్రామీణ యువత రూ.100 నుంచి మొదలుకుని రూ.వేలల్లో బెట్టింగుల్లో పోగుట్టుకుంటున్నారు. మ్యాచ్ ఆరంభం నుంచి మొదలుకుని ఆఖరి బంతి వరకు పందేలు కాస్తున్నారు. టాస్ నుంచి మొదలుకుని బంతి బంతికి ఫోర్, సిక్సర్, వికెట్కు డబ్బులు పెట్టి బెట్టింగ్లు కాస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో బెట్టింగ్ జరుగుతుందని సమాచారం.
అంతా చరవాణుల్లోనే..యాప్ల ద్వారా పేమెంట్స్
అయితే ఇదంతా చరవాణుల్లోనే బయటకు తెలియకుండా జరుగుతోంది. వీటికి వేదికలుగా ఆన్లైన్ పేమెంట్ విధానంలో వివిధ యాప్ల ద్వారా డబ్బులు బదిలీ చేసుకుంటున్నారు. ఇష్టమైన జట్లను ఎంచుకుని పందెం డబ్బులను మధ్యవర్తికి బదిలీ చేస్తారు. ఆ తర్వాత గెలిచిన వారికి మధ్యవర్తి కమిషన్ తీసుకుని ఇస్తారు. కొందరు నేరుగా కూడా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. పెట్టిన సొమ్ము ఎప్పటికప్పుడే ఇచ్చిపుచ్చుకుంటున్నారు. డబ్బు పోగొట్టుకున్నా ఎవరికీ బయటకు చెప్పుకోవడం లేదు. యువత దీనికి ఎక్కువగా అలవాటు పడుతోంది. ఇందుకు అప్పులు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో స్నేహితుల మధ్య పొరపొచ్చలు వస్తున్నాయి. గతంలో ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి బెట్టింగ్లో రూ.5 లక్షలు పోగొట్టుకుని కెరీర్నే నాశనం చేసుకున్నాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. అంతకు ముందు ఓ బుకీ కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్కు పాల్పడంతో స్థానికుల నుంచి విమర్శలు రాగానే అక్కడి నుంచి పారిపోయారు.
మేల్కొనకపోతే ముప్పే..
దీనిని అరికట్టకపోతే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. సరదాగా ఆడిన పందేలు వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో పిల్లలపై వారి కుటుంబసభ్యులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వారిని అటువైపుగా వెళ్లకుండా నియంత్రించాలి. బెట్టింగుల వల్ల కలిగే నష్టాలను వివరించాలి. ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు దృష్టి సారించాలి. పోలీసు యంత్రాంగం కూడా దీనిపై ప్రత్యేక దృష్టిసారించి, నిర్మూలించేందుకు అవగాహన కల్పించాల్సి ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో చాప కింద నీరులా..
గతేడాది నుంచి కరోనా వల్ల యువత ఎక్కువగా ఇంటి పట్టునే ఉండటంతో బెట్టింగులకు మరింత అవకాశం కలిగిందని చెప్పవచ్చు. కొందరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ వీటిని ప్రోత్సహిస్తున్నారు. యువతకు ఆసక్తి లేకున్నా పందెం డబ్బుల కంటే అదనంగా ఇస్తామని ఆశచూపి ఇటువైపు లాగుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనూ పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం.