ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప యునెస్కో గుర్తింపు కోసం సిద్ధమవుతుంది. ఇందుకోసం ఆలయ సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి కట్టడాలు, దుకాణాలు ఉండరాదని ఇటీవల జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 10 రోజుల్లో అక్కడున్న దుకాణాదారులు ఖాళీ చేస్తున్నారు.
రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు వస్తే.. మాకు వచ్చినట్లే అని దుకాణదారులు అన్నారు. దాదాపుగా 5 దశాబ్దాలుగా ఇక్కడే గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని గుడికి వచ్చే భక్తులకు ఆటబొమ్మలు, కొబ్బరి కాయలు, చిల్లర సామాన్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. కానీ అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండానే ఖాళీ చేయించడం సరికాదంటున్నారు. ఈ దుకాణాలపైనే ఆధారపడి జీవిస్తున్న తాము.. ఇకనుంచి ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించకపోతే తాము రోడ్డున పడతామని బాధిత మహిళలు కన్నీరు పెడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తమకు ఆలయానికి దగ్గరలోనే విక్రయాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి : ఒక్క మట్టి గణపతి పెట్టండి... 5 లక్షల నజరానా పట్టండి