సర్వీస్ ప్రొవైడర్లు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్ లో నెట్ వర్క్ సేవలపై అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, తాడ్వాయి, వెంకటాపురం మండలాల్లో నెట్ వర్క్ సమస్యలు ఉన్నట్లు తెలిపారు. నెట్ వర్క్ సమస్యతో ప్రస్తుతం విద్యా వ్యవస్థపై ఎంతో ప్రభావం పడుతుందన్నారు.
జిల్లాలో ఈ- ఆఫీస్ విధానం అమలు చేస్తున్నట్లు, దీనికి ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్ తో పాటు, జిల్లా అధికారులు, మండల అధికారుల కార్యాలయాల్లో నెట్ వర్క్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు, ఆవాసాల వారిగా కావాల్సిన నెట్ వర్క్ కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, కలెక్టరేట్ ఏఓ శ్యామ్ కుమార్, జియో ప్రాంతీయ మేనేజర్ ప్రవీణ్, ఎయిర్ టెల్ సీనియర్ మేనేజర్ సంధ్య, నెట్ వర్క్ ప్రతినిధులు కృష్ణ ప్రసాద్, ప్రణీత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.