మూడుచింతలపల్లి గ్రామం దళితవాడలో రాత్రి నిద్రించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉదయం దళిత వాడలో రచ్చబండ నిర్వహించి దళితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొదట కాలనీ అంతా తిరిగి... అక్కడ స్థానిక పరిస్థితులను పరిశీలించారు. కొందరి ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు వారి ఊరి సమస్యలను రేవంత్ రెడ్డికి వివరించారు.
దళితులతో రేవంత్ ముచ్చట
దళితులు, గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో రెండు రోజుల దీక్ష చేపట్టింది. నిన్న మొదలైన రేవంత్ రెడ్డి (Revanth Reddy) దీక్ష రెండోరోజు కూడా కొనసాగుతోంది. ఈ ఉదయం దళిత కాలనీలో దళితులతో సమావేశమైన రేవంత్ రెడ్డి... వారితో మాట్లాడారు.
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు విజ్ఞప్తి
ప్రభుత్వ పథకాలు... ఏవేవీ అందుతున్నాయో రేవంత్ అడిగి తెలుసుకున్నారు. వర్షం వస్తే ఇందిరమ్మ కాలనీ ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని, కాలనీ కంటే అయిదారు అడుగులు ఎత్తున... రోడ్డు వెయ్యడం వల్లనే… వర్షపు నీరు ఇళ్లలోకి వస్తున్నట్లు తెలిపారు. పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడు ఎకరాల భూమి, ఉద్యోగాలు, పట్టాదారు పాసుబుక్కులు తదితర అంశాలపై రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వెంటనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్కు ఫోన్ చేసి మూడు చింతల పల్లి స్థానిక సమస్యలను వివరించి తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యమ ముసుగులో...
పీసీసీ ఆధ్వర్యంలో 48 గంటల దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష మూడుచింతలపల్లిలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. కట్టమైసమ్మ ఆలయంలో రేవంత్ పూజలు చేసి.. భారీ ర్యాలీగా వెళ్లి దీక్షలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో పెట్టిన పార్టీని.. ఉద్యమ ముసుగులో బలోపేతం చేసుకుని... ప్రయోజనం పొందారని ఆరోపించారు. 'నీళ్లేమో జగన్రెడ్డి తీసుకుపాయె.. నిధులేమో నీ జేబులోకి పాయె.. నియామకాలేమో నీ ఇంటికి వచ్చె.! తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది' అని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంత అణచివేతకు గురవుతోందో చూస్తున్నామని అన్నారు. కేసీఆర్ నుంచి విముక్తి కల్పిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. మూడుచింతలపల్లి గ్రామం దళిత వాడలో రాత్రి బస చేశారు.
ఇదీ చదవండి : 'నీళ్లేమో జగన్రెడ్డి తీసుకపాయే.. నిధులేమో కేసీఆర్ ఇంట్లోకి చేరె'