ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తా మల్కాజిగిరి పార్లమెంటు స్థానం పరిధిలో మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 16 లక్షలకు పైగా ఓటర్లున్నారు. 2014లో ఈ స్థానం నుంచి తెదేపా తరఫున మల్లారెడ్డి గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్రెడ్డిని బరిలోకి దింపింది. ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నందున నియోజక వర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్ల బలాన్ని కూడగట్టుకుంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమవుతాయని రేవంత్ రెడ్డి అన్నారు.
మద్దతుదారులతో చర్చలు
అధిష్ఠానం నుంచి ప్రకటన రాగానే లోక్సభ సీటు ఆశిస్తున్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను కలసి మద్దతు కోరారు. వారంతా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఇష్టం లేకపోయినా సీనియర్ నాయకుల సలహా మేరకే బరిలోకి దిగానని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ఇదీ చదవండి:"కేసీఆర్పై చర్యలు తీసుకోండి"