పింఛనుదారుల కోసం వినియోగిస్తున్న ఫేషియర్ రికగ్నిషన్ పరిజ్ఞానం ద్వారా ఓటర్ల గుర్తింపును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కొంపల్లి పురపాలక సంస్థలోని పది పోలింగ్ కేంద్రాల్లో పైలట్ పద్ధతిన ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొంపల్లిలోని 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 పోలింగ్ కేంద్రాలను ఇందుకు ఎంపిక చేశారు.
టీఎస్టీఎస్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ఓటర్లను గుర్తిస్తారు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి రాగానే మొబైల్ లోని యాప్ సాయంతో గుర్తింపు ప్రక్రియ చేపడతారు. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాలోని ఫొటోలను అప్పటికే యాప్తో అనుసంధానిస్తారు. ఓటరు ఫొటోను, జాబితాలోని ఫొటోను యాప్ పరిశీలిస్తుంది. ఫొటో సరిపోతే గుర్తించినట్లు సందేశాన్ని ఇస్తుంది.
ముఖాన్ని గుర్తించకపోతే...?
యాప్ గుర్తించకపోయినప్పటికీ సదరు ఓటరును ఓటింగ్కు అనుమతించకుండా ఉండేందుకు వీల్లేదు. మామూలు విధానంలో గుర్తింపు పత్రం, పోలింగ్ ఏజెంట్ల నుంచి సమాచారం తీసుకొని సదరు ఓటరును ఓటింగ్కు అనుమతించవచ్చు. ఓటరు గుర్తింపు కోసం ఈ పరిజ్ఞానాన్ని కేవలం అదనపు సౌకర్యంగానే వినియోగిస్తున్నట్లు, ఓటర్ల ఫొటోలను యాప్ నుంచి తొలగిస్తామని... ఎక్కడా ఉపయోగించబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
పది పోలింగ్ కేంద్రాల కోసం 4జీ సదుపాయం కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ ఫోన్లను సమకూర్చాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ను ఎస్ఈసీ ఆదేశించింది. ఫేషియల్ రికగ్నిషన్ విధానం ఉపయోగానికి సంబంధించి అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, పోలింగ్ సిబ్బంది, సంబంధిత వ్యక్తులకు పోలింగ్కు ముందు రోజు అవగాహన కల్పించనున్నారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్నగర్ కార్పొరేషన్