మెదక్ పట్టణంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రం రూపం దాల్చుతున్న దృష్ట్యా... నేటి నుంచి మే 4 వరకు పట్టణ వ్యాపారులు పరిమిత స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం స్వచ్ఛంద లాక్డౌన్కు ముందుకొచ్చినట్లు మెదక్ న్యూ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దుల కృష్ణ తెలిపారు. వ్యాపారస్థులంతా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
మెదక్ పట్టణానికి పరిసర ప్రాంతాల్లో నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారని... ఇటువంటి సమయంలో కరోనా కేసులు ఎక్కువయ్యే అవకాశముందని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా తమ వంతు చర్యగా తామంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని... మాస్కులు ధరించి... తమ కుటుంబాలని కాపాడుకోవాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరి జాగ్రత్తలో వారు ఉంటూ కేసులు పెరగకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని వ్యాపారస్థులు విజ్ఞప్తి చేశారు. స్థానికుల సౌకర్యార్థం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు తెరిచి ఉంటాయని సూచించారు.