తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యుత్ రంగంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలో రూ.12.39 కోట్లతో ఏర్పాటు చేసిన 132/33 కేవీ సబ్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మెదక్ పట్టణంలో రూ.2.11కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్కు మంత్రి శంకుస్థాపన చేశారు.
తెలంగాణ వస్తే అంతా చీకటి మయం అవుతుందన్న సమైక్య పాలకుల మాటలను తల్లకిందులు చేస్తూ నేడు దేశంలోనే అత్యధిక విద్యుత్ను వినియోగిస్తున్న రాష్ట్రంగా నిలిచామని హరీశ్ రావు అన్నారు. 70 ఏళ్ల పాలనలో పొట్టకూటికోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన మన సోదరులు ఈ ఏడేళ్ల ప్రభుత్వ పాలనలో అభివృద్ధిని చూసి గ్రామాలకు తరలి వస్తున్నారని తెలిపారు.
శంకరంపేట మండల ప్రజలకు త్వరలోనే కాళేశ్వరం నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామంలో అర్హులైన గిరిజనులకు గిరివికాస్ పథకం కింద రూ.6.73 లక్షల విలువ చేసే సబ్ మేర్సిబుల్ పంపు సెట్లను అందించారు. 5 ఎకరాలపైబడి భూమి ఉండి బోర్లు లేని వారు కొత్తగా బోర్లకోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ శాసన సభ్యురాలు పద్మాదేవెందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యస్.హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: లక్ష్మీనరసింహ స్వామి ఎత్తిపోతల పనుల ప్రీక్లోజర్కు అనుమతి