కాంటా వేసిన ధాన్యం రైస్మిల్లుకు తరలించడం లేదని మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన మెదక్ మండలం ఖాజిపల్లిలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన విశ్వనాథం 150 బస్తాల ధాన్యాన్ని 45 రోజుల క్రితం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. దాదాపు నెల రోజుల తర్వాత కాంటా వేసినా మిల్లుకు మాత్రం తరలించలేదు. దీంతో ప్రతిరోజూ వడ్ల బస్తాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షాలకు సంచులు తడిసి ధాన్యంలో మొలకలు వచ్చాయి.
ఈనెల 9న కొనుగోలు కేంద్రం మూసివేస్తారని సమాచారం అందడంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. హమాలీలకు పైసలిస్తే ధాన్యం బస్తాలను రైస్మిల్లుకు పంపిస్తారని.. అందుకు రూ.4 వేలు ఇవ్వాలని తన తల్లి పద్మను అడిగాడు. ఇదే విషయంలో తల్లితో పాటు సోదరి అస్మిత మధ్య గొడవ తలెత్తింది. దీంతో తాను నష్టపోతానని భావించిన నవీన్ తీవ్ర మనస్తాపానికి గురై మధ్యాహ్నం ఇంటి వద్దే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తల్లి పద్మ, సోదరి అస్మిత అతన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై మెదక్ రూరల్ ఎస్సై కృష్ణారెడ్డిని సంప్రదించగా.. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు తగాదాలే కారణమని.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.