ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొందరైతే ఏకంగా సొంత మద్యం దుకాణాలకే కన్నం వేసి లిక్కరు బాటిళ్లను దొంగలు ఎత్తుకుపోయారంటూ బ్లాక్మార్కెటుకు తరలిస్తున్నారు. ఒక్కో బాటిలుపై ఎమ్మార్పీ కంటే మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తూ అందిన కాడికి దండుకొంటున్నారు. ఆబ్కారీ శాఖలో చాలాకాలంగా తిష్ఠ వేసిన కొందరు అధికారులు, సిబ్బందికి తెలిసే ఈ తతంగమంతా సాగుతోంది.
జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి ఓ దుకాణానికి కన్నం వేసి రూ.10 లక్షల మద్యం తరలించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పాలమూరులోని పలు మద్యం దుకాణాలు, బార్ల నుంచి పెద్దఎత్తున మద్యం తరలిపోయినట్లు సమాచారం. ఈ తతంగమంతా రాత్రివేళ్లలో యథేచ్ఛగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
తెర వెనుక ఉంటూ ఈ తతంగం నడిపిస్తున్న కొందరు వ్యక్తులు, అధికారులు కొందరు మద్యం దుకాణదారులతో ఇటీవల ములాఖత్ అయినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు.. గుడుంబాపై దాడులంటూ హల్చల్ చేస్తున్న ఆబ్కారీశాఖ లిక్కర్ తరలింపుపై మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం. మహబూబ్నగర్లోని ఓ మందుల దుకాణదారు సైతం ఇదే అదనుగా లిక్కర్ బ్లాకు దందా చేస్తున్నట్లు సమాచారం.
- ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దుకాణాల నుంచి మద్యం తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్న ఉదంతాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. కొత్తకోటలో రెండు మద్యం దుకాణాలు, కల్వకుర్తి, వీనపగండ్ల, నారాయణపేట, ఆత్మకూరు, పెబ్బేరులలో సైతం దుకాణాల నుంచి మద్యం తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో ఆబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరులో ఓ దుకాణం గోదాం నుంచి మద్యం అపహరణకు కన్నం వేశారు. ఈ ప్రయత్నం ఫలించలేదు.
- ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనరుగా పనిచేసిన జయసేనారెడ్డి పదవీ విరమణ తర్వాత పాలమూరుకు పూర్తిస్థాయి డీసీ రాలేదు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా డీసీ ఖురేషీ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కొందరు ఎక్సైజ్ అధికారులదీ ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. పూర్వ మహబూబ్నగర్ జిల్లాలో చాలాచోట్ల రాజకీయ నేతలు, ప్రముఖులకు సంబంధించిన మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. ఏమైనా దాడులు జరిగితే.. ఆ నేతల నుంచి ఫోన్లు వస్తాయి. అధికారుల వెనకడుగుకు ఇది మరో కారణం.
- మహబూబ్నగర్లోని గోకుల్ వైన్సులో జరిగిన ఇంటిదొంగల చోరీలో కేసు నమోదు కాకుండా పెద్దఎత్తున పైరవీలు నడిచినట్లు తెలుస్తోంది. అచ్చంపేటలో శుక్రవారం దాడులకు వెళ్లిన ఓ ఎక్సైజ్ అధికారికి మద్యం దుకాణాదారులు ఊరి బయట తోటలో విందు ఏర్పాటు చేశారు. వీటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఆరు కేసులు నమోదు చేశాం...
లాక్డౌను నేపథ్యంలో ఉమ్మడి పాలమూరులో మొత్తం ఆరు ఆబ్కారీ కేసులు నమోదు చేశామని మహబూబ్నగర్ ఎక్సైజ్శాఖ ఇన్ఛార్జి డీసీ ఖురేషీ తెలిపారు. మహబూబ్నగర్లోని గోకుల్ వైన్సు, వీపనగండ్ల, కొత్తకోట, కల్వకుర్తి, నారాయణపేటలోని మద్యం దుకాణాల లైసెన్సులనూ సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. మిగతా మద్యం దుకాణాల్లోనూ స్టాకు ఇచ్చినప్పడు.. లాక్డౌనుతో మూసి వేసినప్పడు రిజిస్టరులో నమోదైన వివరాలను పరిశీలిస్తామన్నారు. ఎక్కడైనా మద్యం దుకాణం సీలు తొలగించినట్లు తేలితే తప్పక చర్యలు తీసుకుంటామని ఖురేషీ హెచ్చరించారు.