మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో కోటి విత్తన బంతులు వేసే కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేట సమీపంలోని ప్రభుత్వ భూముల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి వెంకట్రావు వెల్లడించారు.
9 రోజుల్లో కోటి విత్తన బంతులు..
ఆరోవిడత హరితహారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో కోటి మొక్కలు నాటడంతో పాటు.. కోటి విత్తన బంతులు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో 9 రోజుల్లో కోటి విత్తన బంతుల తయారీని పూర్తి చేశారు.
మనుషులతో పాటు రెండు డ్రోన్ల ద్వారా నేడు ఈ విత్తన బంతులను విసరనున్నారు. రానున్న పది రోజుల్లో ప్రభుత్వ భూములు, అడవుల్లో వీటిని వేయనున్నారు. ఇందుకు సంబంధించిన ట్రయల్రన్ ఇప్పటికే పూర్తి చేశారు.
కోటి విత్తన బంతుల కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే డీఆర్డీఏ అధికారులు ఆన్లైన్ ద్వారా నామినేషన్ అప్లోడ్ చేసినట్లు సమాచారం.
ఇదీచూడండి: ఆర్టీసీలో బోగస్ ఉద్యోగాల పేరిట వల.. రూ.57 లక్షలు వసూలు