పాలమూరు జిల్లాలకు విదేశాల నుంచి వచ్చినవారిని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే గుర్తించి క్వారంటైనులో ఉంచారు. వీరిలో సగం మందికిపైగా 14 రోజుల క్వారంటైను గడువు ముగిసింది. ఎవరికీ కరోనా పాజిటివ్ నిర్ధరణ కాలేదు. మరోవైపు.. ఉమ్మడి పాలమూరు కార్మికులు, కూలీలు, విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. ప్రధానంగా ముంబయి, పుణె, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కూలీపనులు చేసూకుంటూ జీవనం సాగిస్తున్నవారు ఎక్కువ. వీరంతా అక్కడి మురికివాడల్లో నివాసం ఉంటున్నారు.
లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి చాలామంది పాలమూరు జిల్లాలకు తిరిగి వచ్చారు. కొంతమంది నేరుగా రోడ్డు మార్గంలో వస్తుండగా.. మరికొందరు సరిహద్దు పొలాల మీదుగా వస్తున్నారు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది వచ్చారనేదానిపై అధికారులు దృష్టి సారించారు. ప్రతి గ్రామంలో ఆశా కార్యకర్త, ఎఎన్ఎం, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు జల్లెడ పడుతున్నారు. విమాన సర్వీసుల బందు కారణంగా ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే అవకాశాలు లేకపోవడంతో అధికారులు అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
ముంబయి, పుణె వంటి నగరాల్లో చాలామంది కరోనా బారిన పడినవారు ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి వచ్చినవారిపై వైద్య, ఆరోగ్యశాఖ గట్టి నిఘా పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని, పూర్తిస్థాయిలో సర్వే చేస్తున్నామని ఉమ్మడి పాలమూరుకు చెందిన ఓ జిల్లా కలెక్టరు ‘ఈనాడు’కు వెల్లడించారు. ప్రధానంగా ఏయే నగారాల నుంచి ఎక్కువగా వచ్చారు? అక్కడ ఏం చేసేవారు? అక్కడి మురికివాడల పరిస్థితి ఏమిటి? తదితర వివరాలను ఆరా తీస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లా కలెక్టరు వెంకట్రావు శనివారం వలస కూలీలపై క్విక్ సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో ఆరా తీయాల్సిన అంశాలపై తహసీల్దారులు, ఎంపీడీవోలు, వైద్యాధికారులతో వీసీ నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వం వివరాలు అడుగుతుండటంతో పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసేపనిలో అధికారులు ఉన్నారు.
రోజువారీగా వివరాలు సేకరిస్తున్నాం
రోజువారీగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారి వివరాలు సేకరిస్తున్నామని ఆయా జిల్లాల డీఎంహెచ్వోలు కృష్ణ (మహబూబ్నగర్), శ్రీనివాస్ (వనపర్తి), సుధాకర్లాల్ (నాగర్కర్నూలు), ఇన్ఛార్జి డీఎంహెచ్వో శైలజ (నారాయణపేట), శశికళ (జోగులాంబ గద్వాల) ‘ఈనాడు’కు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇంకా ఎవరైనా వస్తే టోల్ ఫ్రీ నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరినీ క్వారంటైనులో ఉంచుతున్నట్లు వివరించారు.
చెన్నై నుంచి రెండు కంటైనర్లలో 80 మంది హర్యానా, రాజస్థాన్ వాసులు తరలివెళ్తుండగా మానవపాడు ఆర్టీఏ చెక్పోస్టు అధికారులు శనివారం అడ్డుకోవడంతో టోల్ప్లాజా వద్ద ఆగిన దృశ్యం. వీరంతా తమిళనాడులో లారీడ్రైవర్లుగా పనిచేస్తూ లాక్డౌన్ నేపథ్యంలో స్వరాష్ట్రాలకు బయలుదేరారు.
ఇదీ చూడండి: మద్యం దొరక్క ఆత్మహత్యాయత్నం