శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ విచారణ ప్రారంభమైంది. విచారణాధికారి గోవింద్ సింగ్ నాయకత్వంలోని సుమారు 25మందితో కూడిన బృందం ఇవాళ శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించింది. తొలత ఈగలపెంటలోని జెన్కో అతిధి గృహంలో సీఈ, డీఈ, ఈఈ స్థాయి అధికారులతో బృందం సమావేశమైంది.
ఘటన జరిగిన తీరు, ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, ఇతర అంశాలు సిబ్బందిని అడిగి బృందం తెలుసుకుంది. అక్కడి నుంచి భూగర్భంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా సభ్యులు పరిశీలించారు. సొరంగంలో అవకాశం ఉన్నంత మేర లోపలికి బృందం వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతం, అత్యవసర మార్గాలు అన్నింటినీ పరిశీలించినట్టు సమాచారం.