మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీ గోపాల గోవర్ధన గోసంరక్షణ శాల ట్రస్టులో రూ.లక్షల కొద్దీ అవినీతి జరిగిందని ట్రస్టు సభ్యుడు గుమ్మడవెల్లి శ్రీనివాస్ ఆరోపించారు. 2009లో గోపాల గోవర్ధన్ గోసంరక్షణ శాలా ట్రస్టుని కొద్ది మంది సభ్యులతో గుమ్మడవెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రస్టు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో గత కొన్నేళ్లుగా 100 గోవులను సంరక్షిస్తున్నారు.
ఎనిమిదేళ్ల కిందట పాత కమిటీ మారిన అనంతరం గోశాలలో అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని శ్రీనివాస్ ఆరోపించారు. ట్రస్టుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు చూపించడం లేదని, కార్యవర్గ సమావేశాలు కూడా జరపడం లేదని ఆరోపించారు. ప్రతీసారి అధ్యక్ష, కార్యదర్శులు గోశాల సంబంధించిన లావాదేవీల గురించి అడిగితే... తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని.. ఎనిమిదేళ్ల నుంచి గోవుల సంరక్షణ కరవైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోశాల అక్రమాలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని, కలెక్టర్కు సైతం గోశాలలో జరుగుతున్న అక్రమాలు వివరిస్తామని తెలిపారు.
"గోశాలలో అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాతలు ట్రస్టుకు ఇచ్చిన డబ్బులతో కమిటీ వాళ్లు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆవులకు కనీస రక్షణ లేకుండా పోయింది. వాటికి సరైన తిండి, సంరక్షణ కరువైంది. అధ్యక్ష, కార్యదర్శులు గోశాలకు సంబంధించిన లావాదేవీల గురించి అడిగితే... నాపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ట్రస్టు డబ్బులు వాడుకుంటూ వాటి లెక్కలు చూపించడం లేదు. ఆర్డీవో, పోలీసులు, కలెక్టర్ గోశాలలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.....".
-ట్రస్టు సభ్యుడు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్
ఇదీ చూడండి: నేటి ప్రధాన వార్తలు