మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బొడ్లాడకు చెందిన కుందూరు శ్రీకాంత్రెడ్డి తన కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి ఆందోళన చేశారు. తనకు న్యాయం చేయడంతోపాటు భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ అధికారులతో వాగ్వాదం చేశారు.
గ్రామ శివారులోని 316వ సర్వే నెంబర్లో తనకు వారసత్వంగా వచ్చిన 5.35 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ రైతు.. తనకు ఆ సర్వే నెంబర్లో ఎలాంటి భూమి లేకున్నా తప్పుడు ఆధారాలతో 1.11 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు.
తనతోపాటు సదరు వ్యక్తిని పోలీసులు బైండోర్ చేశారని చెప్పారు. ఆ వ్యక్తి బైండోవర్ నిబంధనలు అతిక్రమించి వివాదాస్పద భూమిలో నాటు వేశారని అన్నారు. అతడిపై చర్యలు తీసుకోకుండా తనకు మాత్రం అధికారులు నోటీసులు జారీ చేయడం సమంజసం కాదన్నారు. వారిపై చర్యలు తీసుకుని భూమి తనకు సంక్రమించేలా న్యాయం చేయాలని కోరారు. లేదంటే చావడానికైనా సిద్ధమని అధికారులకు హెచ్చరించారు.
ఇదీ చూడండి : కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు