మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు, మున్నేరు, పాలేరు, పాకాల, ఒట్టి వాగులున్నాయి. భూగర్భ జలాలకు దోహదపడే ఈ వాగుల్లోంచి ఇసుకను అక్రమార్కులు యథేచ్ఛగా తోడేవారు. నిత్యం వందల ట్రాక్టర్లల ద్వారా వందల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించేవారు. వరదనీటి ప్రవాహంతో కళకళలాడే వాగులు వానాకాలం పూర్తవక ముందే ఎడారిని తలపించేవి.
అక్రమ రవాణాతో...
ఇలాంటి పరిస్థితుల్లో వాటి పరవాహక ప్రాంతాల్లోని వ్యవసాయ బావులు, బోర్లలోని భూగర్భజలాలు అడుగంటడం వల్ల రెండు పంటలకు బదులు ఒకే పంట పండేది. వేసవి రాకముందు నుంచే పలు మండలాల్లోని గ్రామాల్లోనూ భూగర్భ జలాలు పూర్తిగా పాతాళానికి పడిపోయేవి. భూగర్భ జలశాఖ వారు డ్రై మండలాలు, గ్రామాలను గుర్తించి బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఆ ప్రాంతాల్లో బోర్లు వేయడాన్ని నిషేధించారు. ఇందుకు కారణం అక్రమ ఇసుక రవాణా అని తెలింది.
కలెక్టర్ దృష్టి...
వాగుల్లో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగకుండా భూగర్భ జలాల పరిరక్షణ కోసం ఇసుక అక్రమానికి తెరపడేలా జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ దృష్టిసాౖరించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ప్రజలు నిర్మించుకునే గృహాలకు, ఇతరాత్ర పనులకు గోదావరి ఇసుకనే వినియోగించేలా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో 5 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోదావరి ఇసుక ఉపకేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇసుక డిపో...
ఈ ఇసుక డిపోలో కేవలం ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసేందుకే అవకాశం ఇచ్చారు. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలనే షరతు విధించారు. ఇందుకోసం www.sand.telangana.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలి. ఈ లింక్ను ఓపెన్ చేసిన తర్వాత ఇసుక కావాల్సిన వారు ముందుగా వన్టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ట్రాక్టర్ల యాజమానులు కూడా వన్టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే స్లాట్ బుకింగ్ అవుతుంది. ఒక్కొ ట్రాక్టర్లో 3 క్యూబిక్ మీటర్ల ఇసుక పడుతుంది. ఈ లెక్కన క్యూబిక్ మీటరు రూ. 2,100 చొప్పున మూడు క్యూబిక్ మీటర్లకు రూ. 6,300 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
గోదావరి ఇసుక డిపోను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : బల్దియా పోరులో.. అనుచరగణం.. అందుకుంది ఫలం