ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో వలస కూలీలు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి రంజాన్ అలీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఊరూరా తిరిగి పేదలను ఆదుకున్నారు. సీపీఎం మండల శాఖ ఆధ్వర్యంలో 100 మంది పేదలకు సరకులు పంపిణీ చేశారు.
ఏన్కూరులో...
ఏన్కూరు మండలంలో భాజపా మండల కమిటీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేశారు. పార్టీ జిల్లా నాయకుడు కొవ్వూరి నాగేశ్వరరావు, నాళ్ల నారాయణ, రమేశ్, దుర్గయ్య పాల్గొన్నారు.
తల్లాడలో...
తల్లాడలో పలుచోట్ల దాతలు వితరణలు చేశారు. పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది గ్రామాల్లో కరోనాపై అవగాహన కల్పించారు. కోవిడ్19 సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. తల్లాడలో బంగారు దుకాణాల యాజమానుల సంఘం ఆధ్వర్యంలో పేదలకు సరకులు పంపిణీ చేశారు. మంగాపురం గ్రామంలో లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల ఆధ్వర్యంలో కూలీలకు నిత్యావసర వస్తువులు అందజేశారు.
వైరాలో...
వైరాలో ఆర్ఎంపీ వైద్యులతో సమావేశమైన ఎస్సై సురేశ్ పలు సూచనలిచ్చారు. ప్రభుత్వం సూచించిన విధంగా లాక్డౌన్ ముగిసే వరకు ఆసుపత్రులు తెరవొద్దని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. వైరాలో పురపాలక సంఘం వైస్ ఛైర్మన్ ముళ్లపాటి సీతారాములు ఆధ్వర్యంలో 400 మందికి బియ్యం, సరకులు అందజేశారు. మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, పురపాలక ఛైర్మన్ సూతకాని జైపాల్ అందజేశారు.