వీధి వ్యాపారుల రుణాల మంజూరులో నిర్లక్ష్యం వహించే బ్యాంకర్లపై కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ కలెక్టర్ కె.శశాంక హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారులకు 5 శాతం రుణాలు అందించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆత్మ నిర్భర్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి రుణాల మంజూరుపై బ్యాంకర్లు, మున్సిపల్ అధికారులతో కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు.
బ్యాంకుల వారీగా పట్టణ ప్రాంత జనాభాలో రుణాలను నిర్దేశించిన ప్రకారం వీధి వ్యాపారుల జీవనోపాధికి వెంటనే రూ. పదివేల చొప్పున రుణాలు అందించాలని కలెక్టర్ అన్నారు. గతంలో పలుమార్లు ఆదేశించినప్పటికీ బ్యాంకర్లు నిర్లక్ష్యం వహించడం వల్ల చిరు వ్యాపారులు నష్టపోతున్నారని తెలిపారు. లక్ష్యాలు సాధించడంలో పూర్తిగా వెనకబడి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన కెనరా బ్యాంకు అధికారిని సమావేశం నుంచి కలెక్టర్ బయటకు పంపించారు. రుణాల మంజూరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని బ్యాంకర్లకు సూచించారు.
ఇప్పటికే ఏడు సార్లు సమావేశాలు నిర్వహించినట్లు కలెక్టర్ చెప్పారు. వచ్చిన ధరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి వంద శాతం పూర్తి చేయాలని, లేని పక్షంలో బ్యాంకర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శశాంక హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి'