ఇంటింటికి మంచి నీరందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ఇంకా కొన్ని గ్రామాల్లో అమలు కావడం లేదు. వేసవి సమీపిస్తుండటం వల్ల నీటి ఎద్దడున్న ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడక తప్పేలా లేదు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలకేంద్రంలో వేసవి రాకముందే తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. మంచి నీరు కావాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి తీసుకురావాల్సిన దుస్థితి ఎదురైంది. తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు పలుమార్లు మొర పెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదని భిక్కనూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
మంచినీరు కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఇప్పటికైనా అధికారులు, పంచాయతీ పాలకవర్గం స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం... 18 లక్షలు చోరీ