జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నేరేడుపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ... తన భర్తను తండ్రి సాయంతో హత్య చేసి అడవి ప్రాంతంలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం నర్సాక్కపల్లికి చెందిన రమేశ్... తాపీ మేస్త్రి. రమేశ్, శారద దంపతులకు ఓ కూతురు ఓ కుమారుడు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాల వల్ల రమేశ్ను అత్తగారిల్లయిన నేరేడుపల్లికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి రమేశ్ కనిపించకుండా పోయాడు.
తన భర్త కనిపించటంలేదని భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో భార్య శారద ఫిర్యాదు చేసింది. అనంతరం రమేశ్ బంధువుల పెళ్లికి కూడా వెళ్లి వచ్చింది. నెల తర్వాత అసలు విషయం బయటపడింది. చనిపోయిన వారికి చేయాల్సిన కార్యక్రమాలను శారద చేసింది. నెల మాసికం పెట్టింది. ఇవన్ని చూసి అనుమానం వచ్చిన బంధువులు, గ్రామస్థులు నిలదీయగా... తానే చంపినట్లు ఒప్పుకుంది. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది.
పోలీసులు తమదైన శైలిలో విచారించగా... రమేశ్ను తన తండ్రి సాంబయ్యతో కలిసి చంపేసినట్లు శారద ఒప్పుకుంది. అనంతరం అడవిలో పాతిపెట్టినట్టు పేర్కొంది. రమేశ్ బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.