ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో వరుస పేలుళ్లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అలజడి నెలకొంది. సైనిక దాడులకు నిరసనగా సీపీఐ మావోయిస్టు పార్టీ నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాల్లో మావోయిస్టు యాక్షన్ కమిటీలు సంచరిస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయని తెలిపారు. అడవుల్లోనూ ప్రత్యేక భద్రతా బలగాలతో గాలిస్తున్నారు.
బంద్ను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ వరుసగా ప్రకటనలు విడుదల చేయడం వల్ల రాష్ట్రాల సరిహద్దుల్లో రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట ప్రాంతంలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. గోదావరి తీర ప్రాంతాల్లోని మహదేవపూర్, మహాముత్తారం, భూపాలపల్లి, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వెంకటాపురం, వాజేడు, మంగపేట ప్రాంతాలతోపాటు మండలాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలు, జీపీఎస్ లాంటి సాంకేతికతను వినియోగిస్తూ కల్వర్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: కూలి కోసం.. కూటి కోసం.. వలసకూలీల వెతలు.!