బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు... బాలల హక్కులను కాలరాసి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అంగన్వాడీ టీచర్లు గ్రామంలో పర్యటించి వీటికి సంబంధించిన వివరాలను... ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్, సఖి కేంద్రం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి...
అణచివేతకు గురైన మహిళలను చేరదీసి వారి సంరక్షణ చేపట్టేందుకు సఖి కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలకు సహాయ సహకారాలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలపై వేధింపులు జరగకుండా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఖాళీ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు...
జిల్లాలో ఉన్న దివ్యాంగుల పూర్తి సమాచారాన్ని సేకరించి, వారికి అవసరమైన పరికరాలను అందించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అంగన్వాడీ, ఐసీడీఎస్, ఐసీపీఎస్, సఖి కేంద్రంలో వివిధ ఖాళీ పోస్టుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. వాటి నియామకానికి వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని అన్నారు.
ఇదీ చదవండి: వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి