రూర్బన్ మిషన్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి కేంద్ర ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. జిల్లా పాలనాధికారి కార్యాలయంలో భూపాలపల్లి మండలంలోని నాగారం క్లస్టర్లో కార్యక్రమ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.
యువతకు అందుబాటులో..
గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి వసతులు కల్పించేందుకు నాగారం క్లస్టర్ పరిధిలో ఎంపికైన 18 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మంచి అవకాశమన్నారు. అందువల్ల అన్ని గ్రామాల్లోని యువతకు అందుబాటులో ఉండేలా నాగారం క్లస్టర్లో రెవెన్యూ అధికారులతో సంప్రదించాలన్నారు. భూమిని ఎంపిక చేసి.. స్కిల్ డెవలప్మెంట్ భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఒకే ప్రాంగణంలో..
గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ద్వారా రైతులు అధికంగా లబ్ధి పొందే అవకాశం ఉన్నందున.. విజయ డైరీ వారితో కలిసి వెంటనే పాల సేకరణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్లస్టర్లోని అన్ని గ్రామాల్లో కూరగాయల రైతులను ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హెల్త్ సెంటర్ లేని గ్రామాల్లో హెల్త్ సబ్ సెంటర్తో పాటు అంగన్వాడి భవనం ఒకే ప్రాంగణంలో ఉండేలా నిర్మించాలన్నారు. ప్రారంభమైన వివిధ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో మిషన్ భగీరథ నీటిని వాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శైలజ, రూర్బన్ మిషన్ జిల్లా ప్రాజెక్టు అధికారి సింధూర, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుధార్ సింగ్, డీపీఓ లత, డీఈవో హైదర్, పంచాయతీరాజ్ డీఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మొక్కలు నాటిన మోనాల్ గజ్జర్.. మరికొందరికి గ్రీన్ 'ఛాలెంజ్'