జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో లోక్సభ సభ్యుడు పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు. రూ. 1450 కోట్ల 81 లక్షలతో 2020- 21 ఆర్థిక సంవత్సర ప్రణాళికను విడుదల చేశారు. బ్యాంకర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ, పరిశ్రమలు, డీఆర్డీఏ, మెప్మా శాఖల అధికారులతో సమీక్షించారు.
ప్రణాళికలో అత్యధిక భాగం రూ. 1070 కోట్ల 11 లక్షలను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించేలా రుణాలు ఇవ్వాలని, గ్రామాల వారీగా తేదీలను ఖరారు చేసి ఆ సమయంలో వచ్చిన రైతులు ఇబ్బంది పడకుండా మంజూరు చేయాలని సూచించారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు, వీధి వ్యాపారులకు ముద్ర రుణాలను అందించి ఆదుకోవాలని తెలిపారు. 100 శాతం పంటరుణాలను అందించే దిశగా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సుమతి, జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ నగేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, జిల్లా పరిశ్రమల అధికారి సురేశ్, బీసీ సంక్షేమ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం