జగిత్యాల జిల్లాలో వరిని వేసే రైతులు 5.5 శాతంగా, మొక్కజొన్నకు బదులుగా 51.6 శాతంగా ఆయిల్పామ్ సాగుకు మళ్లాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆయిల్పామ్ పంటకు కేంద్ర మద్దతు ధర ప్రకారం కంపెనీలు బైబ్యాక్ పద్ధతిన తీసుకుంటాయి కాబట్టి ప్రభుత్వం అనుమతించిన మండలాల్లోని రైతులే సాగుచేయాలి.
జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 950 ఎకరాల్లో సాగుకు అనువుగా ఉన్నట్లు గుర్తించగా రాయికల్లో 1,300, బీర్పూర్ 650, సారంగాపూర్ 2,840, ధర్మపురి 600, బుగ్గారం 350, జగిత్యాల రూరల్ 600, కోరుట్ల 650, మెట్పల్లి 950, కొడిమ్యాల 650, పెగడపల్లి 300, గొల్లపల్లి 2,195, వెల్గటూరు మండలంలో 1,000 ఎకరాలు అనువైనవిగా గుర్తించారు. తొలిదఫాలో 13,035 ఎకరాల్లో సాగు చేపట్టనుండగా తదుపరి నాలుగేళ్లపాటు సాగును విస్తరించుకుంటూ 27 వేల ఎకరాలకు చేర్చుతారు.
అనుకూలమెలా:
ఆయిల్పామ్కు గాలిలో తేమ అధికంగా ఉండాలి. ఇటీవల గోదావరిపై ఆనకట్టలు కట్టడం, సాగునీటి ప్రాజెక్టులతో భూగర్భ నీటి లభ్యత పెరగడం తదితర కారణాలతో మన జిల్లాలోనూ గాలిలో తేమశాతం ఇటీవల అధికంగా నమోదవుతోంది. భారత ఆయిల్పామ్ పరిశోధనసంస్థ, ఆంధ్రప్రదేశ్లోని పెదవేగి ఆయిల్పామ్ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలు పలుమార్లు జిల్లాలో పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించింది. వ్యవసాయ పరిశోధనస్థానం నుంచి వాతావరణ నివేదిక, భూగర్భ జలవనరుల శాఖ నుంచి నీటిలభ్యత, నీటిపారుదల శాఖనుంచి ఆయకట్టు, ప్రాజెక్టుల ద్వారా పారే నీరు, ఉద్యానశాఖ నుంచి పంటలసాగు వివరాలను శాస్త్రవేత్తలు సేకరించారు. జిల్లాలోని రైతులతో మాట్లాడి పూర్తి వివరాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తరువాత జగిత్యాల జిల్లాలోని 13 మండలాలు ఆయిల్పామ్ సాగుకు అనువైనట్లుగా గుర్తించారు.
జూన్, జులైలో మొక్కలు నాటేలా ఏర్పాట్లు
రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఆయిల్పామ్ సాగుకు అనువుగా ఉండగా మంచిర్యాల జిల్లాలోని జైపూర్ నర్సరీలో 5 లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే రాయికల్ తదితర మండలాల్లోని 400 మందికిపైగా రైతులు దరఖాస్తు చేయగా నిర్దేశిత కోటా ప్రకారం దరఖాస్తులు వచ్చిన తరువాత అశ్వరావుపేటలో శిక్షణ, క్షేత్రసందర్శన, అక్కడి రైతులతో బృంద చర్చలు, గానుగ పరిశ్రమల సందర్శన తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. తదుపరి జూన్, జులై మాసాల్లో మొక్కలను నాటుకునేలా ఏర్పాట్లు చేస్తారు.
అమ్మకం ఇలా
ప్రస్తుతం అశ్వరావుపేట వద్ద క్రషింగ్ పరిశ్రమలున్నాయి. జిల్లాలో సాగు కనీసం 2 వేల ఎకరాలుంటే క్రషింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. చెట్టులో పక్షం రోజుకొక గెల చొప్పున నిరంతర కాపు ఉంటుంది. తొలుత రైతులు గెలలను తెంపిన తరువాత కలెక్షన్ సెంటర్ వరకు చేర్చాలి. తదుపరి కలెక్షన్ సెంటర్ నుంచి కంపెనీ ప్రతినిధులు గెలలను తీసుకెళతారు. కంపెనీలు కనీస మద్దతు ధరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన పక్షం రోజుల్లోపు రైతుల ఖాతాలకు చెల్లింపులు జరుపుతారు.
ప్రభుత్వ రాయితీ
ఆయిల్పామ్ సాగుకుగాను ఎకరాకు 1.50 లక్షల రాయితీ ఉండగా మొక్కలు, ఎరువులు, పురుగుమందులు తదితరాలకు, మూడేళ్ల నిర్వహణ ఖర్చుల కింద ఈ మొత్తాన్ని అందిస్తారు. ఎకరంలో 53 మొక్కలను నాటుకునే వీలుండగా నాటిన 6వ సంవత్సరం నుంచి కాపు వస్తుంది. నాటిన 10 సంవత్సరాల వరకు ఆయిల్పామ్ మొక్కల మధ్యన పప్పుదినుసులను అంతర పంటలుగా వేసుకోవచ్ఛు 6వ సంవత్సరం నుంచి దాదాపుగా 30-40 సంవత్సరాల వరకు చెట్టు కాపునిస్తుంది. సాలుకు ఎకరాకు 10 టన్నుల గెలల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్నుకు రూ.11 వేలకుపైగా మద్దతు ధర ఉంది.