Low level bridge: జగిత్యాల జిల్లాలో వర్షం వచ్చిందంటే జనం అల్లాడిపోతున్నారు. చిన్నపాటి వర్షాలకే రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలోని గ్రామీణ మండలం అనంతారం జాతీయ రహదారి వద్ద, ధర్మపురి మండలం నేరేళ్ల వద్ద లో లెవెల్ వంతెనలు ఉండగా.. వర్షాలు కురిసినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి. జాతీయ రహదారి కావడంతో ధర్మపురి-మంచిర్యాల రహదారి నుంచే ఎక్కువ శాతం మంది ప్రయాణం చేస్తుంటారు. ఏటా లో లెవెల్ వంతెనలు మునిగిపోతుంటాయి. ఈసారి కురిసిన భారీ వర్షాలకు సైతం వంతెనలు మునగడంతో రాకపోకలు సాగించలేక జనం ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని పెర్కపల్లి వద్ద తరచూ వంతెనలు మునిగిపోతుంటాయి. రాయికల్ మండలంలోని చల్గల్, సింగరావు పేట, మైతాపుర్, అల్లీపూర్తో పాటు మరికొన్ని లో లెవెల్ వంతెనలపై ఇదే పరిస్థితి నెలకొంది. వీటితో పాటు ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి, కోరుట్ల, మెట్పల్లి, మల్యాల, మల్లాపూర్ తదితర మండలాల్లోనూ లో లెవెల్ వంతెనలపై రాకపోకలు నిలిచిపోతున్నాయి.
నిధులకు మోక్షమెప్పుడో..: రహదారులు, భవనాల శాఖ జిల్లాలో దాదాపు 35కు పైగా లో లెవెల్ వంతెనలు ఉన్నట్లు గుర్తించి ప్రతిపాదనలు తయారు చేసింది. కానీ ఒకటీ రెండు వంతెనలకు తప్ప... మిగతా వాటి నిర్మాణానికి నిధులు రావడం లేదు. లో లెవెల్ వంతెనల వద్ద ఎత్తు పెంచి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన లోలెవల్వంతెనల నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి..
కట్టిపడేస్తోన్న 'పాకాల' అందాలు.. మది పరవశించే రమణీయ దృశ్యాలు..
పండగలా రాష్ట్రపతి ఎన్నిక.. ఓటేసిన ఎంపీలు.. వీల్ఛైర్లో మన్మోహన్