ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో డిసెంబర్ 4న మొదలైన అంతుచిక్కని వ్యాధి కలవరం దాదాపు రెండు వారాల పాటు కొనసాగింది. మొత్తం 622 మంది ఆస్పత్రిలో చేరారు. క్రమంగా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇంతలోనే రామకృష్ణాపురానికి చెందిన ఒక బాలిక, తూర్పువీధికి చెందిన ఓ వృద్ధుడు ఇవే లక్షణాలతో శుక్రవారంనాడు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు.
ఇది వన్టైం ఎపిసోడ్
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఘటన ‘వన్టైం ఎపిసోడ్’ (ఒకసారి సంభవించే ఘటన)గా ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయపడినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. గతేడాది డిసెంబరులో ఏలూరులో పలువురు అకస్మాత్తుగా పడిపోయిన సంఘటనకు కారణాలపై అధ్యయనం చేయడానికి జాతీయ సంస్థలు వివిధ రకాల నమూనాలను సేకరించామని తెలిపారు. ముంబయి, దిల్లీ, పుణె, హైదరాబాద్, ఇతరచోట్ల ఉన్న వివిధ సంస్థల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించిన నివేదికను త్వరలో ఏపీ సీఎం జగన్కు అందజేస్తామన్నారు. అవసరమైన చోట్ల నీటి, ఆహార పదార్థాల నమూనాలు పరీక్షించేందుకు ప్రయోగశాలలను అభివృద్ధి చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఏలూరు కెనాల్ వెంట ఉన్న గ్రామాల్లో నమూనాలను సేకరిస్తామని వివరించారు. ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కొమిరేపల్లికి వచ్చినట్లు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్దాస్ తెలిపారు. వైద్యుల చికిత్సతో బాధితులు వెంటనే కోలుకుంటున్నారని చెప్పారు. ఎవ్వరూ కంగారుపడాల్సిన అవసరంలేదని అన్నారు. వైద్య బృందాలు అన్ని వేళల్లోనూ సిద్ధంగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
రాజకీయ కుట్ర కోణం ఉండొచ్చు: ఆళ్ల నాని
అంతుచిక్కని వ్యాధుల సంఘటనలకు సంబంధించి రాజకీయ కుట్రకోణం ఉన్నట్లు భావించాల్సి వస్తోందని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అనుమానం వ్యక్తం చేశారు. కొమిరేపల్లిలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘పరిస్థితి అదుపులోనే ఉంది. ఇటీవల ఏలూరు పరిసర ప్రాంతాల్లో వ్యాధిని వారం రోజుల్లో పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాం. రెండు రోజుల కిందట పూళ్ల, శుక్రవారం కొమిరేపల్లిలో అక్కడక్కడా కేసులు నమోదు కావడం అనుమానాలకు తావిస్తోంది. నమూనాల పరీక్షల నివేదికలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్వో సునంద తదితరులు ఉన్నారు.
తోపులాట.. కిందపడిన జనసేన నాయకురాలు
కొమిరేపల్లిలో బాధితులను పరామర్శించడానికి వచ్చిన జనసేన దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి అక్కడ జరిగిన తోపులాటలో కిందపడ్డారు. పార్టీ కండువా వేసుకుని వెంకటలక్ష్మి అక్కడికి రావడంపై ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అభ్యంతరం తెలిపారు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమెను అక్కడి నుంచి పంపించేయాలని వైకాపా కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని వెంకటలక్ష్మిని అక్కడి నుంచి పంపించే క్రమంలో తోపులాట జరగ్గా... ఆమె కిందపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో పోలీసులు తనపై చేయి చేసుకున్నారంటూ వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏలూరు కాలువపై ప్రత్యేక దృష్టి
ఏలూరు కాలువ ద్వారా వంద గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని ఏపీ అధికారిక సమావేశంలో శుక్రవారం చర్చ జరిగింది. ఈ కాలువ వెంబడి ఉన్న గ్రామాలు, నీటి సరఫరా కేంద్రాలు, ఇతరచోట్ల నమూనాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. పూళ్ల గ్రామంలో సేకరించిన నీటి, ఆహార పదార్థాల నమూనాలను పరీక్షించగా అనుమానించదగ్గ ఫలితాలు రాలేదని, కొమిరేపల్లెలోనూ నమూనాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో 12 రకాల కూరగాయలు, మూడు ప్రదేశాల్లో మాంసం, పది రకాల బియ్యం, రెండు రకాల పప్పు దినుసులు, నూనె, పాల నమూనాలు సేకరించి కొన్నింటిని ఏలూరు ప్రయోగశాలకు, ఇంకొన్నింటిని హైదరాబాద్లోని ఐఐసీటీకి పంపారు. సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. బాధితులు తీసుకున్న ఆహారంపై ఆరా తీశారు. గ్రామానికి చుట్టూ పొలాలు ఉండటంతో ఇటీవల పురుగు మందులు పిచికారీ చేయడం.. తదితర అంశాలనూ పరిశీలిస్తున్నారు.
మొదట నా భార్య, కొడుకు మూర్ఛ, తలనొప్పి, కాళ్లు చేతులు వణుకుతో కళ్లు తిరిగి పడిపోయారు. వారిని నేను ఆస్పత్రికి తీసుకొచ్చా. ఇంతలో మా ఇద్దరు అబ్బాయిలు, నేను కూడా పడిపోయాం. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. కళ్లు తెరిచి చూస్తే అందరం ఆస్పత్రిలో ఉన్నాం. తర్వాత మా తమ్ముడి కొడుకు కూడా పడిపోయాడు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. - గుర్రం శేషగిరిరావు, కొమిరేపల్లి
వారం రోజుల్లో రెండుసార్లు మూర్ఛ వచ్చింది. మొదట గత ఆదివారం అనూహ్యంగా తలనొప్పితో కళ్లుబయర్లు కమ్మాయి. ఒక్కసారిగా ఇంట్లో సింక్పై పడ్డాను. భుజానికి బలమైన గాయమైంది. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లా. మళ్లీ అదే తరహాలో గురువారం మూర్ఛ వచ్చింది. ఈ సమయంలో నాలుక కొరుక్కోవటంతో గాయాలయ్యాయి. - శ్రీనివాసరావు, పూళ్ల
ఇదీ చదవండి: సమంత రికార్డు.. దక్షిణాదిలోనే తొలి నటిగా