హైదరాబాద్లో వ్యక్తిగత వాహనాల వేగం చూస్తే రోడ్డుపైకి వచ్చే జనం వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వాహనం ఎవరిమీదకు దూసుకుపోతుందో తెలీని పరిస్థితి నెలకొంది. రోడ్డు మీద నడిచేవారికే కాదు.. బస్స్టాపుల్లో నిల్చున్నవారికీ, చివరకు హోటల్ బయట కూర్చున్నవారికీ భద్రత లేకుండా పోయింది.
నగరం సంగతి
వేగం పరిమితికి మించి నడిపేవారిని హెచ్చరించే వ్యవస్థలే లేవు. అవుటర్ రింగ్రోడ్డుపై ఎక్కడో ఒకచోట స్పీడ్గన్తో వేగం కొలిచే పోలీసులు ఉంటారు. కొన్నిచోట్ల అయినా సీసీ కెమెరాలు గమనిస్తాయి. మరి నగరంలోనో? ఇక్కడ చూసేవారే లేరు. అందుకే ఈ దూకుడు. మరి ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా వేగానికి కళ్లెం వేసేది ఎప్పుడంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
21వ శతాబ్దం దిశగా
మద్యం తాగి వాహనాల నడిపేవారి సంగతి పక్కన పెడితే.. అత్యాధునిక వాహనాలను సమకూర్చుకుని 21వ శతాబ్దం దిశగా దూసుకుపోవడానికి యువత ఉర్రూతలూగుతోంది. కానీ మన రహదారులు, భద్రతా ప్రమాణాలు మాత్రం ఓ శతాబ్దకాలం వెనుకబడి ఉంటున్నాయి. అన్నింటా ఆధునిక పోకడలు పోతున్న మహానగరం రహదారుల భద్రత విషయంలో తీసికట్టుగా మిగలడం కూడా ప్రమాదాలకు అసలు కారణంగా కనిపిస్తోంది.
ప్రపంచ స్థాయి ప్రమాణాలేవి?
ప్రపంచస్థాయి ప్రమాణాలను పరిశీలిస్తే చాలా దేశాల్లో రహదారులపై భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉంటాయి. అక్కడ ప్రాణాలకు, ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పొరపాటున వాహనం రోడ్డుపై అదుపు తప్పి కాస్త పక్కకు మళ్లితే చాలు.. రోడ్డుపై రంబుల్స్ తరహాలో ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటివల్ల వాహనానికి కుదుపులు రావడంతో డ్రైవర్ అప్రమత్తం అవుతారు.
క్రాష్ బ్యారియర్స్
అలాగే రోడ్ల పక్కన ప్రమాదాలను నియంత్రించే క్రాష్ బ్యారియర్స్ ఉంటాయి. వాహనం అదుపు తప్పి వాటిని ఢీకొన్నా ప్రాణం నష్టం పెద్దగా జరిగే అవకాశం ఉండదు. కొన్నిచోట్ల అవి దూసుకువచ్చే వాహనాల వేగాన్ని నియంత్రించేలా ఉంటాయి. ఈ విధానాలు అమెరికా, యూరప్ తదితర దేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్ల మీద కూడా అలాంటి ఏర్పాట్లేవీ ప్రమాణాల ప్రకారం ఉండకపోవడం విషాదకరం.
సరకు వాహనాలకేనా పరిమితి?
ప్రమాదాలకు మితిమీరిన వేగమే అసలు కారణమని ప్రమాదం జరిగిన ప్రతీసారీ వెల్లడవుతోంది. సరకు రవాణా వాహనాల వేగం నియంత్రణకు స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటును కేంద్రం అనివార్యం చేసింది. వ్యక్తిగత వాహనాలకూ ఈ ఏర్పాటు చేయాలనే అంశంపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ యోచనలో ఉన్నా అది కార్యరూపంలోకి రావటంలేదు.
ఇలా చేస్తే కొంత మేలు..
- రెండు అంచెల్లో క్రాష్ బారియర్స్ను ఏర్పాటు చేయాలి.
- జాతీయ రహదారుల తరహాలో అన్నిచోట్లా ప్రమాద నియంత్రికలుండాలి.
- వాటి ఎత్తు పెంచేందుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలి.
- వంతెనపై పాదచారుల కోసం నిర్మించే నడవాల (కర్బ్) ఎత్తు పెంచాలి.
- వ్యక్తిగత వాహనాల వేగాన్నీ గంటకు 80-100 కి.మీ. పరిమితం చేయాలి.
- వేగాన్ని గుర్తించే స్పీడ్ గన్స్ను విస్తృతం చేయాలి.
- అతి వేగంతో నడిచే వాహనాలను కమాండ్ కంట్రోల్ నుంచే గుర్తించి, నిలువరించాలి.
ఇవీ చూడండి: కొత్త జీహెచ్ఎంసీ చట్టంపై మంత్రి కేటీఆర్ సమీక్ష