కేంద్రం అనుమతి కోటా పూర్తయినందున సీఎం ఆదేశాల మేరకు నేటి నుంచి జొన్న, పొద్దుతిరుగుడు, శనగ పంటల ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య అధ్యక్షుడు మార గంగారెడ్డి అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయం సడలింపు అవకాశాలు ఎవరూ దుర్వినియోగం చేయవద్దని... పంట క్షేత్రాలకు వెళ్లాక భౌతిక దూరం పాటించాలని హైదరాబాద్ జాంబాగ్లో టీఎస్ మార్క్ఫెడ్ సంస్థ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు.
దశలవారీగా నగదు చెల్లింపు
రైతుల ప్రయోజనాలు దృష్ట్యా మూడు రకాల పంట ఉత్పత్తులను ప్రభుత్వం అదనంగా కొనుగోలు చేస్తోందన్నారు. గత ఖరీఫ్లో కొనుగోలు చేసిన పెసలు, సోయా, కందులు, శనగకు దశలవారీగా నగదు చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా రబీ మార్కెటింగ్లో మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు, కందులు, జొన్న విక్రయాలు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు.
మే 5 నుంచి విక్రయాలు...
కేటాయింపులకు అనుగుణంగా రాబోయే ఖరీఫ్ కోసం 4.52 లక్షల టన్నుల రసాయన ఎరువులు జిల్లాలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మే 5 నుంచి దుకాణాల్లో విక్రయాలు చేపట్టేందుకు డీలర్లకు అనుమతివ్వనున్నట్లు గంగారెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ లేఖ