గడ్డి అన్నారం మార్కెట్ను ఈనెల 4 వరకు తరలించవద్దని హైకోర్టు(TS High court on GaddiAnnaram fruit market) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ తరలింపుపై యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది. బాటసింగారం మార్కెట్లో సదుపాయాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ధర్మాసనం ఆదేశించింది. గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హోల్ సేల్ ఫ్రూట్ ఏజెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
వసతుల్లేవ్..
బాటసింగారం తాత్కాలిక మార్కెట్లో కనీస సదుపాయాలు కల్పించకుండానే మార్కెట్ తరలిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది గంగయ్య నాయుడు వాదించారు. కొహెడలో పూర్తి స్థాయి మార్కెట్ సిద్ధం కాకముందే హడావిడిగా తాత్కాలిక మార్కెట్కు మారుస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపారులు, ఏజెంట్లు, హమాలీలకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ఈనెల 4కు వాయిదా
బాట సింగారం మార్కెట్లో తగిన వసతులు ఉన్నాయని.. పిటిషనర్ అసోసియేషన్ అనవసర వివాదం చేస్తోందని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. గడ్డి అన్నారం మార్కెట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనున్నట్లు తెలిపారు. కరోనా పరిస్థితుల్లో(corona situations) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు చాలా అవసరమని.. వాటిని అడ్డుకోవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరిశీలించిన న్యాయస్థానం తరలింపును ఈనెల 4 వరకు వాయిదా వేసింది. బాట సింగారంలో ఏర్పాట్లను పరిశీలించిన నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లే న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శికి ప్రభుత్వం, హోల్ సేల్ ఏజెంట్ల ప్రతినిధులు కూడా సహకరించాలని ధర్మాసనం పేర్కొంది.
ఆ ఉత్తర్వులు సమర్పించాలి
గడ్డిఅన్నారం మార్కెట్ నిమిత్తం బాటసింగారంలో స్థలాన్ని నోటిఫై చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను(TS High court on fruit market) సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. శుక్రవారానికి విచారణను వాయిదా వేస్తూ అప్పటివరకు తరలింపునకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని చెప్పింది. గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపును సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ కమీషన్ ఏజెంట్స్ మరో ఇద్దరు అప్పీళ్లు దాఖలు చేశారు. జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టి... ఈనెల 4 వరకు తరలించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. బాటసింగారం మార్కెట్లో సదుపాయాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది.
ఇదీ చదవండి: TS High court on GaddiAnnaram fruit market: 'బాటసింగారం స్థలం నోటిఫై జీవో సమర్పించండి'