కరోనా ప్రభావంలోనూ గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ రాబడిలో 10 శాతం వృద్ధిరేటు నమోదైంది. అంతకుముందు సంవత్సరం కంటే రాబడి రూ.4,779 కోట్లు పెరిగింది. 2018-19లో రూ.45,379 కోట్లు రాగా.. తర్వాత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధిరేటుతో రూ.47,657 కోట్లు వచ్చింది. 2020-21లో రూ.52,436 కోట్ల రాబడి నమోదైంది.
2020-21 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఏప్రిల్, మే నెలల్లో పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం అమ్మకాలు తగ్గడంతో పాటు జీఎస్టీ రాబడులు గణనీయంగా తగ్గాయి. మే నెల నుంచి లాక్డౌన్ ఎత్తివేయడంతో.. క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం అమ్మకాలతో పాటు జీఎస్టీ రాబడులూ బాగా పెరిగాయి. గత డిసెంబరు నుంచి నాలుగు నెలల పాటు రాబడులు బాగా పెరిగాయి. దీంతోపాటు కేంద్రం నుంచి ఐజీఎస్టీ బకాయిలు అందడం, జీఎస్టీ పరిహారం గతం కంటే రెట్టింపు రావడంతో వాణిజ్య పన్నుల శాఖ రాబడి రూ.52,436 కోట్లకు చేరింది. మార్చి నెలలో వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక కార్యాచరణ నేపథ్యంలో జీఎస్టీ రాబడులు ఫిబ్రవరి కంటే 29 శాతానికిపైగా పెరిగాయి. ఫిబ్రవరి కంటే పెట్రోలు రాబడి రూ.80 కోట్లు తగ్గినా... మద్యం అమ్మకం పన్ను రూ.100 కోట్ల మేర పెరిగింది. కేంద్రం నుంచి అందిన జీఎస్టీ పరిహారంతో కలిపితే వాణిజ్య పన్నుల శాఖ రాబడి వృద్ధిరేటు 10 శాతం ఉండగా.. జీఎస్టీ పరిహారం మినహాయిస్తే వృద్ధిరేటు 3.4 శాతంగా ఉంది.