గుంటూరు జిల్లా వేజెండ్లకు చెందిన ఎస్కే బషీద్కు చిన్నప్పటి నుంచే సినిమాల పిచ్చి... ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాడు. అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎలాగైనా సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాడు. భూములు, స్థలాలను బ్యాంకుల్లో తనఖా ఉంచి రుణం తీసుకుని ఎగవేయాలనుకున్నాడు. పదిహేనేళ్ల క్రితం నేరాలు మొదలు పెట్టిన బషీద్... తొమ్మిది చిత్రాలు నిర్మించాడు. ఐదేళ్ల క్రితం సినిమా హీరోగా ఓ చిత్రాన్ని విడుదల చేశాడు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్టై జైలుకెళ్ళాడు. బెయిల్పై విడుదలై మళ్ళీ తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని టోకరా వేశాడు. రెండేళ్ల క్రితం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.
విరామం అనంతరం కొత్త తరహా మోసాలు...
జైలు నుంచి విడుదలయ్యాక కాస్త విరామం తీసుకుని... కొత్త తరహా మోసాలకు తెరలేపాడు. ఎస్బీకే గ్రూప్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించి... ముంబయి, చెన్నై, బెంగుళూరు, దుబాయ్లో కార్యాలయాలు తెరిచాడు. కోట్లలో రుణాలిస్తానంటూ ధరావతు సొమ్ము పేరుతో లక్షల రూపాయలు బాధితుల నుంచి కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో మరోసారి జైలు పాలయ్యాడు.
సినిమాలు తీయడానికి డబ్బు కోసం భూములు, స్థలాలు లేకపోవడం వల్ల పరిచయస్థులు, స్నేహితులు, హైదరాబాద్లో ఉంటున్న గుంటూరు జిల్లా వాసుల వివరాలను తెలుసుకున్నాడు. అనంతరం బంజారాహిల్స్లో ఓ ఫ్లాటును అద్దెకు తీసుకున్నాడు. తాను సినిమాలు నిర్మిస్తున్నానని, పెట్టుబడులు పెడితే లాభాలిస్తానని ప్రచారం చేసుకున్నాడు. భార్య కరీమున్నీసాతో కలిసి మోసాలు కొనసాగించాడు.
నిందితుడు ఎస్కే బషీద్
తెలిసిన వారుంటే చాలు... వారి పత్రాలతో రుణాలు
వివాదాస్పద స్థలాలు... పరిచయస్థుల ఇళ్లే... బషీద్ లక్ష్యం. తనకు తెలిసిన వారి స్థలాల డాక్యుమెంట్లను జిరాక్స్ తీసుకుని అవి తనవేనని తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నాడు. బషీద్, విమల్ గోయల్ అనే వ్యక్తులు వజ్రాభరణాలు తయారు చేస్తామంటూ తమ వద్ద రూ. 2 కోట్ల రుణం తీసుకుని ఒక్క కిస్తీ చెల్లించలేదంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా హిమాయత్నగర్ శాఖ అధికారులు ఐదేళ్ల క్రితం సీసీఎస్లో ఫిర్యాదు చేశారు.
పరిచయస్థులు కె.ఉమ, సత్యనారాయణ, భరణిల ఇళ్లను తనఖా ఉంచి హెచ్ఎస్బీసీ బ్యాంక్ నుంచి ఏడేళ్ల క్రితం 70 లక్షల రుణం తీసుకున్నాడు. బషీద్ కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు వారికి తాఖీదులు జారీ చేశారు. దీంతో వారు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయలక్ష్మి అనే మహిళ పేరుతో ఉన్న ఆస్తి పత్రాలు తనఖా ఉంచుకుని 35 లక్షల రుణం కావాలన్నాడు. ఆమెను తీసుకురావాలని బ్యాంకు అధికారులు కోరగా... భార్య కరీమున్నీసాను తీసుకెళ్లి రుణం మంజూరు చేయించుకున్నాడు. బంజారాహిల్స్ పోలీస్ ఠాణా పరిధిలో షేక్ బషీద్పై 2005 నుంచి 2007 వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి.
పదేళ్లలో లెక్కలేనన్ని మోసాలు...
ఇలా పదేళ్ళలో లెక్కలేనన్ని మోసాలకు తెరలేపిన బషీద్ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయమని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తవ్వేకొద్దీ బషీద్ నేరాలు బయటకొస్తుండటం గమనార్హం.
ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్ అనుచరుల వీరంగం