రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నాయి. పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా కాశీందేవిపేట (ములుగు జిల్లా)లో 3.8, తాడిచెర్ల(జయశంకర్)లో 3.8, కమలాపూర్(వరంగల్ అర్బన్)లో 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
గత నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రం చిగురుటాకుల వణికింది. పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. భారీ వర్షాలకు చాలాచోట్ల చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆనకట్టలు తెగి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పలుచోట్ల ప్రజలు ప్రమాదకర స్థితిలోనూ ప్రయాణం సాగించారు. వరదల్లో చిక్కుకున్న పలువురు బాధితులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మరికొన్ని చోట్ల... రోడ్లు తెగిపోయాయి. వరద నీరు రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ముంపులో ఉన్న గ్రామ ప్రజలకు అధికారులు సహాయ చర్యలు అందించారు. విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వారం రోజులుగా వర్షాలు తగ్గడంతో... ఇప్పుడిప్పుడే వరద తగ్గుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది.
మరోవైపు ఏకధాటిగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. ఫలితంగా జలాశయాలన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఇవీ చూడండి: