ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు నవంబర్1కి వాయిదా వేసింది. బకాయిల వివరాలను ఈనెల 31లోగా నివేదించాలని ఆర్టీసీ ఎండీకి ధర్మాసనం ఆదేశించింది. జీహెచ్ఎంసీ రూ.335 కోట్లు చెల్లించిందా? లేదా? తెలపాలని ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం చెల్లించిన రూ.4,253కోట్లలో రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయా? వివరాలు పరిశీలించకుండానే ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎలా నివేదిక ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. యాజమాన్యం సమర్పించిన నివేదికలో బ్యూరోక్రాట్లు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని అభిప్రాయపడింది. నవంబర్ 1న ఆర్టీసీలో ఆర్థిక వివరాలు చూసే అధికారి హాజరుకావాలని ధర్మాసనం పేర్కొంది.
బకాయిల కన్నా ఎక్కువే ఆర్టీసీకి ఇచ్చామని న్యాయస్థానానికి ప్రభుత్వం నివేదించింది. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో రూ.125కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. 2020 మార్చి నాటికి రూ.125 కోట్లు ఆర్టీసీకి అందజేస్తామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.
ఉప ఎన్నిక జరిగిన ఒక పట్టణానికి రూ.100 కోట్లు ఇచినప్పుడు... రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాల కోసం ఎందుకు ఇవ్వలేరని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక పట్టణ ప్రజలు ముఖ్యమా... రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమా... ఎలా సమర్థించుకుంటారని వ్యాఖ్యానించింది.
ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య