తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఛైర్పర్సన్ను ఎప్పటిలోగా నియమిస్తారో వారం రోజుల్లో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో మహిళా కమిషన్కు రెండేళ్లుగా ఛైర్ పర్సన్ లేరని పేర్కొంటూ కరీంనగర్కు చెందిన రేగులపాటి రమ్యారావు హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం నాడు విచారణ చేపట్టింది.
మహిళా కమిషన్కు ఛైర్పర్సన్ను ఎందుకు నియమించ లేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. జిల్లా శిశు సంక్షేమ కమిటీలు నియమించలేదని వేసిన ఓ పిల్ పెండింగ్ లో ఉందని.. చట్టబద్ధమైన సంస్థలకు ఛైర్ పర్సన్లను నియమించకపోతే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నియామకానికి ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు చేశారో తెలపాలని ఆదేశించింది.
పూర్తి వివరాలు సమర్పించేందుకు నాలుగు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. నిరాకరించిన ధర్మాసనం వారం రోజుల్లో తెలపాలని స్పష్టం చేసింది. కేసు విచారణకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది వసుధ నాగరాజ్ను అమికస్ క్యూరీగా నియమించింది.