Telangana Congress Second List Released Soon : తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయ పార్టీల్లో ప్రచారం జోరు అందుకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించి బీ - ఫారాలు కూడా అందించి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తుంది. భారతీయ జనతా పార్టీ 52 మంది అభ్యర్థుల పేర్లతో మొదటి జాబితాను ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా పది రోజుల క్రితం 55 పేర్లతో మొదటి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. రెండో జాబితా(Congress MLA Second List 2023) సిద్ధం చేసేందుకు కసరత్తు తీవ్రతరం చేసింది.
శని, ఆదివారాలలో దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసింది. స్క్రీనింగ్ కమిటీలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చ వచ్చినప్పుడు ప్రతికూల అనుకూల వర్గాలు గట్టిగా తమ వాదనలను వినిపించి తమకు అనుకూలమైన నాయకులను ఎంపిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana Congress MLA Candidates List : ప్రధానంగా సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్పేట, ఎల్బీ నగర్, నర్సాపూర్ తదితర పదికి పైగా నియోజకవర్గాలకు ఇద్దరు సమ ఉజ్జీలు ఉండడం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో.. స్క్రీనింగ్ కమిటీ రెండేసి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మొత్తం 64 నియోజకవర్గాలకు చెంది కసరత్తు పూర్తి అయినప్పటికీ చాలా నియోజకవర్గాలలో పోటీ అధికమై అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.
Telangana Assembly Election 2023 : దిల్లీలో బుధవారం మధ్యాహ్నం భేటీ కానున్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ పంపించిన ఒకే పేరు, రెండు పేర్ల జాబితాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండో జాబితాలో దాదాపు 60 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించే సూచనలున్నాయి. మరోవైపు వామపక్షాలతో పొత్తులు ఖరారైనప్పటికీ.. సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లను ఖరారు చేసిన కాంగ్రెస్.. సీపీఎంకు మిర్యాలగూడ సీటును ఖరారు చేసినా.. రెండో స్థానంపై సందిగ్ధత కొనసాగుతోంది. పాలేరు సీటు ఇవ్వాలని పట్టుబడుతున్న సీపీఎం రాష్ట్ర నేతలు.. ఒకవేళ ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి కీలక పార్టీ నేతల చేరికలు పూర్తైతే మూడో జాబితాకూ అడ్డు తొలగిపోనుంది. కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్రను కూడా ఈనెల 28 నుంచి 30 వరకు ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచిస్తోంది.