పురపాలక బిల్లుతో పాటు సివిల్ కోర్టుల సవరణ బిల్లులను ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్, సివిల్ కోర్టుల సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.
పెరిగిన సివిల్ న్యాయస్థానాల ద్రవ్యసంబంధ అధికార పరిధి
రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో సివిల్ న్యాయస్థానాల ద్రవ్యసంబంధ అధికార పరిధిని ప్రభుత్వం పెంచింది. జూనియర్ సివిల్ జడ్జి గరిష్ట పరిధిని మూడు నుంచి 20 లక్షలకు, సీనియర్ సివిల్ జడ్జి గరిష్ట పరిధిని 15 లక్షల నుంచి 50 లక్షల వరకు పెంచింది. జిల్లా జడ్జి పరిధిని కనిష్టంగా 15లక్షల నుంచి యాభై లక్షలకు గరిష్టంగా అపరిమితంగా పరిధిని పెంచింది.
ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యం
తెలంగాణ ప్రజలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంతో పురపాలక చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు సభలో బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. జులై 2019లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఐదు సవరణలు చేయగా.. ఎలాంటి చర్చ లేకుండా పురపాలక చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.
మేం లేనిది చూసి బిల్లులు ఆమోదించారు...
సభలో బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ సభ్యులు లేరు. ఎలాంటి చర్చ లేకుండానే రెండు బిల్లులు శాసనసభ ఆమోదం పొందాయి. తాము సభలో లేనప్పుడు బిల్లులు ఆమోదించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆఖరి క్షణంలో "విపక్ష, పాలక పక్షాల" గొడవ
శాసనవ్యవస్థ పద్దుపై మంత్రి సమాధానం అనంతరం వివరణలు కోరిన కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈసమయంలో విపక్ష, పాలక పక్షాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకొంది.
ఇవీచూడండి: "సీఎం పరిశీలనలో... ఐఆర్, ఫిట్మెంట్ అంశం"