రబీ సాగు అంచనాకు ఏర్పాట్లు, రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రివర్గ ఉప కమిటీ సూచించింది. హాకా భవన్లో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్తోపాటు సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్లు హాజరయ్యారు.
వరిధాన్యం శుభ్రం చేసే యూనిట్లు, టార్పాలిన్ కవర్లు, తేమను పరిశీలించే యంత్రాల కొనుగోలు కోసం ఏర్పాటు చేయాల్సిన అంశాలపై అధికారులకు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని మంత్రి సబ్ కమిటీ అభిప్రాయపడింది. రైస్మిల్లర్లకు చెల్లించాల్సిన అదనపు ఛార్జీలు గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, ఆ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి వెంటనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మార్కెటింగ్, ఎఫ్సీఐ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : హైదరాబాద్, దిల్లీలో కరోనా కేసులు నమోదు