హైదరాబాద్లోని అనేక ప్రాంతాలను ముంపు ముప్పు నుంచి కాపాడటం కోసం హుస్సేన్ సాగర్కు ఎనిమిది గేట్లను ఏర్పాటు చేయబోతున్నారు. సంబంధిత నమూనా(డిజైన్)ను సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ రాష్ట్ర పురపాలక శాఖకు సోమవారం అందజేసింది. ఆ శాఖ కొద్ది రోజుల్లోనే టెండర్లను పిలవబోతోంది. గేట్లు కార్యరూపం దాలిస్తే హుస్సేన్సాగర్ వరద వల్ల నగరానికి ఎటువంటి ముప్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ముంపు సమస్య అధికం
కూకట్పల్లి, పికెట్, బంజారా, ముల్కాపూర్ నాలాల నుంచి వరదనీరు, మురుగునీరు హుస్సేన్ సాగర్లో కలుస్తోంది. 0.9 టీఎంసీల సామర్థ్యం గల ఈ జలాశయం భారీ వర్షాలు పడితే నిండిపోయి అనేక ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి సాగర్కు ఎటువంటి గేట్లు లేవు. ట్యాంక్బండ్పై అలుగు మాత్రమే ఉంది. భారీ వర్షాల సమయంలో అలుగు పైభాగం నుంచి నీరు కిందికి పారుతోంది. భారీ వర్షాల సమయంలో ముంపు నీటిని అవసరమైన మేరకు కిందికి వదలడానికి అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల ముంపు సమస్య ఏర్పడుతోంది.
కమిటీ అధ్యయనం
సాగర్ వరదల అధ్యయనానికి ఇటీవల సాగునీటి శాఖ ముఖ్య ఇంజినీర్(ఈఎన్సీ) మురళీధర్ ఛైర్మన్గా ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కొద్ది రోజుల కిందట ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం అలుగు ఉన్న చోటే వంతెనను నిర్మించి దాని కింద ఎనిమిది గేట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. 38,560 కూసెక్కుల నీరు దిగువకు వెళ్లేలా నమూనా రూపకల్పన చేశారు. నివేదికను ఆమోదించిన ప్రభుత్వం, డిజైన్ను రూపొందించే బాధ్యతను సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కు అప్పగించింది. సోమవారం ఆ సంస్థ పురపాలక శాఖకు డిజైన్ను అందజేసింది. గేట్లు ఏర్పాటు చేసి వరద నీటిని ఎప్పటికప్పుడు కిందికి వదలడం ద్వారా హుస్సేన్సాగర్ ఎగువ భాగంలో ఎటువంటి ముంపు సమస్య ఏర్పడదని నిపుణులు పేర్కొంటున్నారు.
నిర్మాణం ప్రారంభమైతే రాకపోకలు నిలిపివేత
మరో పక్షం రోజుల్లో వంతెన నిర్మాణం, గేట్ల ఏర్పాటుకు టెండర్లను పిలిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గేట్ల నిర్మాణం ప్రారంభిస్తే రెండు, మూడు నెలలపాటు ట్యాంక్బండ్పై వాహనాల రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గేట్ల నుంచి 38 వేల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా వదిలినా ప్రస్తుత నాలాలో ప్రవాహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు నిర్ధారించారు. అవసరమైతే నాలాకు మరమ్మతులు చేయాలనుకుంటున్నారు.
ఇదీ చదవండి: పిల్లల పాఠాల కోసం ఏకంగా రోబో తయారు చేసింది!