రాజేంద్రనగర్ వాలంతరీ కర్షక సాధికార సంఘటన్ అధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చిత్రపటం వద్ద సభాపతి నివాళులర్పించారు. ప్రతి ఏటా కృష్ణా, గోదావరి నుంచి నీరు వృథాగా వెళుతున్న దృష్ట్యా ఆ నీటి సద్వినియోగానికే ప్రాజెక్టుల నిర్మాణమని సభాపతి స్పష్టం చేశారు.
రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో సంక్షేమంతోపాటు వ్యవసాయం, నీటి పారుదల రంగాలకే అధిక ప్రాధాన్యం కల్పించినట్లు పోచారం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 85 వేల కోట్ల రూపాయలు కేటాయించి... తక్కువ సమయంలోనే నిర్మాణం చేయడం గొప్ప విషయమన్నారు. ఎండనకా, వాననకా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసిన ఇంజినీర్లకు సభాపతి వందనాలు చెప్పారు.
అనంతరం వాలంతరీ ఆధ్వర్యంలో మూడు మాసాల కోర్సు పూర్తి చేసిన యువరైతులకు సభాపతి ధ్రువపత్రాలు అందజేశారు. అదే విధంగా ఉత్తమ రైతులకు పురస్కారాలు కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల సంస్థ ఛైర్మన్ వి. ప్రకాష్, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకటరామిరెడ్డి, ఆంగ్రూ విశ్రాంత డాక్టర్ జలపతి రావు, వాలంతరీ డైరెక్టర్ డాక్టర్ బి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం పూర్తి