రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడంతో టీకా కేంద్రాలు కిక్కిరిశాయి. ఈ నెల 15న నిలిచిన ప్రక్రియ మంగళవారం తిరిగి ప్రారంభమైంది. డోసుల మధ్య గడువు పెంపుపై అవగాహన లేక.. చాలా మంది రెండో డోసు కోసం వచ్చి వెనుదిరిగారు. హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే ఇక్కడ కేవలం కొవాగ్జిన్ రెండో డోసు మాత్రమే ఇవ్వడంతో.. కొవిషీల్డ్ కోసం వచ్చిన వారు నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం ముందే జనానికి అవగాహన కల్పించాలని.. ఎప్పుడు ఏ టీకా ఇస్తారో ముందుగానే చెబితే తమకు ఇబ్బందులు ఉండవని లబ్ధిదారులు అభిప్రాయపడ్డారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వ్యాక్సినేషన్ కేంద్రంలో రెండో డోసు కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఒక్కో కేంద్రంలో 200 మందికి మాత్రమే టీకా వేసేందుకు టోకెన్లు ఇవ్వగా.. మిగతా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్లో రెండో డోసులు భారీగానే ఉన్నా.. నూతన మార్గదర్శకాల ప్రకారం 84 రోజులు పూర్తయిన అర్హులు లేకపోవడంతో టీకాలు ఇవ్వలేదు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడితే.. వ్యాక్సిన్ వెయ్యకుండా పంపడం సరికాదంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదనపు కౌంటర్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 113 కేంద్రాల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందించారు. రద్దీగా ఉన్నచోట అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలోని టీకా కేంద్రాల్లో లబ్ధిదారులు బారులుతీరారు. పోలీసులు చేరుకుని రద్దీని నియంత్రించారు.
ప్రతిరోజూ అందుబాటులో ఉంచాలి..
రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. రద్దీ లేకుండా ఎక్కువ కేంద్రాలు పెట్టాలని.. టీకాలు ఆపకుండా అందరికీ ప్రతి రోజూ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. 18-44 ఏళ్ల మధ్యవారికీ టీకాలివ్వాలని యువకులు కోరుతున్నారు.
సజావుగా సాగేనా..
రాష్ట్రంలో నెలాఖరు నాటికి 3 లక్షల మందికి కొవాగ్జిన్, 80 వేల మందికి కొవిషీల్డ్ రెండో డోస్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం 58 వేల కొవాగ్జిన్ డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరిన్ని టీకాలు వస్తే తప్ప.. వ్యాక్సినేషన్ సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు.
ఇదీ చూడండి: 'కాళేశ్వర జలాల మళ్లింపునకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల'