Hyperloop Technology In India : పొడవాటి ఖాళీ ట్యూబ్లో ఒక గోళీ వదిలారనుకోండి. అందులో గోళీ చాలా వేగంగా దొర్లుతుంది కదా..! ఈ హైపర్లూప్ సాంకేతిక పరిజ్ఞానం కూడా అలాంటిదే. దీంట్లో కూడా టన్నెల్, పాడ్ ఉంటాయి. ఈ పాడ్లోనే మనం ప్రయాణిస్తాం.. సుమారు గంటకు 1000-1200 కిలో మీటర్లు వేగం.. విమాన వేగంతో పాటుగా తక్కువ ఖర్చులో అత్యంత వేగంగా దూసుకుపోవడమే దీని ప్రత్యేకత. అయితే ఇది మనం అనుకున్నంతా సులభం కాదు. ఇది ఇంకా అగ్రదేశాల్లోనే అందుబాటులోకి రాలేదు. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఓ తెలుగమ్మాయి నాయకత్వ హోదాలో ఉంది. మరి ఆ ప్రాజెక్టు.. తన ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే..
తొలి అవకాశం అందుకున్నా.. : నా పేరు మేధా కొమ్మాజోస్యుల. మాది హైదరాబాద్ నగరం. నాన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్. నా చదువు ముంబయి, యూఎస్, హైదరాబాద్లో సాగింది. 2020లో మద్రాస్లో ఐఐటీ సీటు సాధించా. ప్రస్తుతం ఆటోమోటివ్ ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నా. కార్లు, ఇతర వాహనాల్లో ఆధునాతన సాంకేతికత తీసుకురావాలన్నదే నా కల.
అందుకే.. హైపర్లూప్ ఆలోచన నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే దీనికోసం ఆవిష్కార్ పేరుతో ఓ విద్యార్థి పరిశోధక బృందం వర్క్చేస్తోంది. నా పనితీరు, ఆలోచనలు వారికి నచ్చడంతో దానికి నన్ను టీమ్ లీడర్గా చేశారు. దీనికి మొత్తం ముగ్గురు లీడర్లు ఉండారు. కానీ, అమ్మాయికి ఈ అవకాశం దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రయాణికులు కూర్చునే పాడ్ని రూపొందించడానికి ఒక లీడర్, వాక్యూమ్ ట్యూబ్తో పాటు ఇతర మౌలిక వసతులకు గాను మరో లీడర్ ఉన్నారు. ఈ మొత్తం సాంకేతికతను ఎలా సౌకర్యవంతంగా తయారుచేయాలి, అలాగే వాణిజ్య పరంగా ఎలా మలచాలి.. ఇందుకోసం ఇతర కంపెనీలు, ప్రభుత్వాలతో సంప్రదిపుల బాధ్యతలను నేను చూసుకుంటున్నాను.
అయ్యే పనికాదన్నారు.. : మా బృందంలో మొత్తం 50 మంది టీమ్ ఉన్నాం. ఈ ప్రాజెక్టుని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి పగలూ, రాత్రి కష్టపడి పనిచేస్తున్నాం. ఇందుకుగానూ ముందుగా ఓ చిన్న పాడ్ను తయారుచేసి 30మీ ట్రాక్పై ట్రయల్స్ చేసి విజయం సాధించాం. దీన్ని మరింత వృద్ధి చెందేలా చేసేందుకు చాలా సంస్థల్ని సంప్రదించాం. మనదేశంలో దీన్ని తీసుకురావడం అసాధ్యమని చాలామంది అన్నారు. మా సాంకేతికత పరిజ్ఞానంపై పూర్తి నమ్మకంతో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాం. స్వదీశీ హైపర్లూప్లో దమ్ము ఉందని నిరూపించేందుకు మాకు దాదాపు ఆరు నెలలు సమయం పట్టింది.
కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ మా క్యాంపస్కు వచ్చి సందర్శించి ఈ ప్రాజెక్టుకుగానూ రూ.8.34 కోట్లు ప్రకటించారు. ఇప్పుడు భారతీయ రైల్వే, ఎల్ అండ్ టీ, భారత్ బెంజ్, టీఐఐ లాంటి దిగ్గజ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం. మాకు ఇదో గొప్ప విజయం. ప్రస్తుతం అయిదో ప్రొటో టైప్ పాడ్ను తయారుచేశాం. దీన్ని 400మీ పొడవైన వాక్యూమ్ట్యూబ్లో ప్రయోగించబోతున్నాం. ఇందులో కూడా విజయం సాధిస్తే ఇక నిజమైన ప్రాజెక్టు ట్రయల్స్కు వెళ్లడమే.
నగరాల్ని కలిపేలా.. : లూప్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎలక్ట్రో మాగ్నటిక్ సాంకేతికత, వాక్యూమ్ ట్యూబ్, బ్రేకింగ్ మెకానిజం అంతా మా బృందం సొంతంగా చేసుకున్నవే. మా సత్తాను నిరూపించుకునేందుకు అంతర్జాతీయ పోటీల్లోనూ మేము పాల్గొన్నాం. మాకు 2021లో యూరోపియన్ హైపర్లూప్ వీక్లో మోస్ట్ స్కేలబుల్ డిజైన్ అవార్డు దక్కింది. 2022 నెదర్లాండ్స్లో జరిగిన పోటీల్లో గ్లోబల్ టాప్ 5లో స్థానం సాధించాం. ఈ పోటీలతో ప్రపంచస్థాయి కంపెనీలు, వారి ఆలోచనలు కొంతవరకు తెలుసుకోగలిగాం. త్వరలో బెంగళూరు, చెన్నై మధ్య అరగంట ప్రయాణం సాధ్యం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్ని కలిపేలా హైపర్లూప్ తేవాలనేది కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆలోచన. మా కృషిని చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై వచ్చి మమ్మల్ని మెచ్చుకున్నారు. మీమీద దేశం ఎన్నో ఆశలు పెట్టుకుందని చెప్పారు. ఆడపిల్లగా టీమ్ను లీడ్ చేస్తున్నందుకు నన్నెంతో గౌరవించారు ప్రధాని మోదీ. ఆ క్షణాలు నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ బృందంలో నాతో పాటు మరో ఏడుగురు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం ఈ తరహా పరిశోధనల్లో అమ్మాయిలకు మంచి అవకాశాలున్నాయి. ఎంత కష్టపడితే అన్ని అవకాశాలు మన ముందుకు వస్తాయి.
ఇవీ చదవండి: