కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు, వ్యాధి సోకిన వారి వైద్య చికిత్సకు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. కరోనా ఓ జాతీయ విపత్తు అని, దీన్ని దేశమంతా కలిసి ఎదుర్కోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాలను, రాజకీయ పక్షాలను సంప్రదించి ముందుకుపోవాలనే ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేకే పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకులతో మాట్లాడారు. తెరాస రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, లోక్సభాపక్ష నేత నామ నాగేశ్వర్ రావు హైదరాబాద్ నుంచి పాల్గొన్నారు. కరోనా వైరస్కు విరుగుడుగా వ్యాక్సిన్ వస్తోందని... దీనిని ప్రాధాన్యతా క్రమంలో అందరికీ వేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం ముందున్న సవాల్గా తెలిపారు.
ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా, ఓ ప్రణాళిక ప్రకారం చేయాలన్నారు. దీని కోసం ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ అందించడం కోసం అవసరమైన ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం చేశారని... ముందుగా వైద్యసిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించినట్లు కేకే స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ చైన్ సిద్ధం చేశారన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేశారని వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు అమలు అవుతున్నాయని తెలిపారు.
ఇదీ చూడండి: టీకా వస్తోంది.. వారికే తొలి ప్రాధాన్యం: మోదీ